Crime News: ఖమ్మం జిల్లాలో తల్లీపిల్లల మృతి.. వీడని అనుమానాలు

జిల్లాలోని రఘునాథపాలెంలో తల్లి, పిల్లల మృతిపై అనుమానాలు వీడటం లేదు. బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక(4), తనిష్క(3)తో కలిసి కారులో మంగళవారం రాత్రి మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు.

Updated : 29 May 2024 12:03 IST

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లి, పిల్లల మృతిపై అనుమానాలు వీడటం లేదు. బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంగళవారం రాత్రి మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో తల్లి, పిల్లల మృతదేహాలను భద్రపరిచారు. శవపరీక్ష నివేదిక వచ్చాకే ప్రమాదమా? హత్యా? అనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన విషయం తెలిసి కుమారి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

వివాహేతర సంబంధమే కారణమా?

ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తె కుమారితో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి హరిసింగ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వారికి ఇద్దరు కుమార్తెలేనని, కుమారుడు పుట్టలేదని ప్రవీణ్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిపై ఏడాదిగా దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్‌ 20 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. పది రోజుల క్రితం కుమారి, తన పిల్లలతో హైదరాబాద్‌ నుంచి బాబోజితండాకు వచ్చారు. 25న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ తెమ్మన్నా ప్రవీణ్‌ తేలేదని హరిసింగ్‌ తెలిపారు. ఈ క్రమంలో వారు చనిపోవడం, కుమారి, పిల్లల శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే అతన్ని ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని