AP news: ఖాళీ స్థలంపై వివాదం.. మహిళను మంటల్లోకి తోసేసిన వైకాపా నేత!

ఖాళీ స్థలం విషయంలో తగాదా రావడంతో ఓ వైకాపా నాయకుడు మహిళను మంటల్లో తోసేసిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది.

Updated : 13 Apr 2024 14:14 IST

గాజువాక: ఖాళీ స్థలం విషయంలో తగాదా రావడంతో ఓ వైకాపా నాయకుడు మహిళను మంటల్లో తోసేసిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది. న్యూపోర్టు సీఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం..  గాజువాక 65వ వార్డు బానోజితోటలో రాధ(35) నివాసం ఉంటోంది. ఆమె ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉండగా.. శుక్రవారం వైకాపా నాయకుడు లోకనాథం అక్కడ చెట్లు నరికి అగ్గి పెట్టాడు. దీంతో రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్థలం తనదని.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ అతడిని నిలదీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో లోకనాథం ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో మంటల్లోకి తోసేయడంతో ఆమె చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రాధ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

మరోవైపు లోకనాథం తాను ఆ సమయంలో సంఘటనా స్థలంలో లేనని చెబుతున్నాడు. కొద్దిరోజులుగా ఆమె తనపై  కక్ష పెట్టుకుని ఫిర్యాదు చేస్తోందని ఆరోపించాడు. దీనిపై సీఐను సంప్రదించగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టినట్లు చెప్పారు. ఖాళీ స్థలంపై గత కొన్నాళ్లుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని