logo

వివాహిత ఆత్మహత్యాయత్నం!.. భర్తే నిప్పంటించాడని బంధువుల ఆరోపణ

ఓ వివాహిత ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

Updated : 21 Apr 2024 06:43 IST

ఈనాడు, వరంగల్‌, మామునూరు, న్యూస్‌టుడే: ఓ వివాహిత ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు బాధితురాలి బంధువులు.. భర్తే ఆమెను పెట్రోలు పోసి నిప్పంటించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఎండీ అస్మ(25) కొన్నేళ్ల కిందట మండిబజార్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి మధ్య గొడవలు తలెత్తడంతో అస్మ హనుమకొండ సుబేదారి మహిళా పోలీసుస్టేషన్‌కు వెళ్లి భర్త తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అక్కడ మరో వ్యక్తి ద్వారా వరంగల్‌కు చెందిన ఎండీ మజార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే మజార్‌కు పెళ్లయ్యింది.  మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె మొదటి భర్తతో తెగతెంపులు చేసుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్మ, మజార్‌లు రెండో పెళ్లి చేసుకున్నారు. చెప్పుల దుకాణం నడిపే మజార్‌ రెండో భార్య అస్మతో కలిసి వరంగల్‌ నాయుడు పెట్రోలు బంకు సమీపంలోని శ్రీసత్యసాయినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మనస్తాపానికి గురైన అస్మ శనివారం సాయంత్రం ఇంట్లో తన ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆమెను కాపాడే క్రమంలో భర్త మజార్‌ చేతికి కూడా గాయాలయ్యాయి. అస్మకు 90శాతం శరీరం కాలిపోవడంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ ఘటనపై మామునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అస్మ బంధువులు మాత్రం మజారే ఆమె ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడని ఆరోపిస్తున్నారు. ఆయన బయట నుంచి పెట్రోలు కూడా తీసుకెళ్లడం చూశామని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని