logo

Passport: పాస్‌పోర్టు చిరిగిందా.. పోగొట్టుకున్నారా..?

పాస్‌పోర్టు చిరిగిందా..పోగొట్టుకున్నారా..? వెంటనే రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోండి. డ్యామేజీ పాస్‌పోర్టును ఇన్‌వ్యాలీడ్‌గా పరిగణిస్తారు. విదేశీ ప్రయాణాలను నిలిపివేసే అవకాశముంది.

Updated : 30 May 2024 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాస్‌పోర్టు చిరిగిందా..పోగొట్టుకున్నారా..? వెంటనే రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోండి. డ్యామేజీ పాస్‌పోర్టును ఇన్‌వ్యాలీడ్‌గా పరిగణిస్తారు. విదేశీ ప్రయాణాలను నిలిపివేసే అవకాశముంది. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో 5  సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. రోజూ 4 వేల అపాయింట్‌మెంట్లు జారీ అవుతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం దరఖాస్తుల్లో చిరిగిపోయినవి లేదా పోగొట్టుకున్నవి ఉంటున్నాయి. కొందరు రీఇష్యూ కోసం తత్కాల్‌లో బుక్‌ చేస్తున్నారు. తర్వాత అధికారుల సూచనతో సాధారణ విధానానికి మార్చుకుని ప్రక్రియ పూర్తి చేసేసరికి సమయం వృథా అవుతోంది. చిన్న చిరుగు పడినా పాస్‌పోర్టు డ్యామేజీగానే పరిగణించే అవకాశం ఉంది. వీటికి వెంటనే డూప్లికేట్‌ జారీ చేసే అవకాశం లేదు. పాస్‌పోర్టు లాస్, డ్యామేజీ ఆప్షన్‌ కింద ‘రీ-ఇష్యూ’కు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం కొత్త పాస్‌పోర్టుకు మరో నంబరు కేటాయించి ఆ తేదీ నుంచి పాస్‌పోర్టు గడువు నిర్ణయిస్తారని చెబుతున్నారు.

విదేశాల్లో పోతే ఎలా..?

గతంలో ఓ యూట్యూబర్‌కి విదేశాల్లో ఇలాంటి అనుభవం ఎదురైంది. పాస్‌పోర్టు కాపీ దగ్గరే ఉండడంతో అతను స్థానికంగా ఉండే ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ కాపీతో ఇండియన్‌ ఎంబసీకి వెళ్లి ఆన్‌లైన్‌ లేదా రాతపూర్వకంగా పాస్‌పోర్టు పోగొట్టుకున్న సమాచారాన్ని అందించారు. అత్యవసరం అని చెప్పడంతో సంబంధిత పత్రాలు సమర్పించిన తర్వాత కొంత రుసుము తీసుకుని వెరిఫికేషన్‌ పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో కొత్త పాస్‌పోర్టు పంపుతారు. వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. పాస్‌పోర్టు, వీసా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ జిరాక్స్‌లు లేదా ఫోన్‌లో పీడీ…ఎఫ్‌ కాపీలు పెట్టుకోవడంతో ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.  

సంఘటనలు ఇవి..

మల్కాజిగిరికి చెందిన అజయ్‌  పాస్‌పోర్టు తీసుకుందామని దరఖాస్తు చేసుకున్నారు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన రోజు పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లగా సిబ్బంది మీ వివరాలతో ముందే పాస్‌పోర్టు ఉంది కదాని అడిగారు. అవాక్కయిన అజయ్‌ ఇంట్లో వారిని  ప్రశ్నించగా అతని తండ్రి 20 ఏళ్ల కిందటే పాస్‌పోర్టు తీసుకున్నట్లు చెప్పారు. అది దొరక్కపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ తీసుకురావాలన్నారు. పాస్‌పోర్టు పోయిందని స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం మీసేవాలో రీఇష్యూకి దరఖాస్తు చేశారు. స్థానిక పోలీసులు ధ్రువీకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ అందజేశారు.దానిని పాస్‌పోర్టు సేవాకేంద్రంలో సమర్పించడంతో  కొత్త పాస్‌పోర్టు వచ్చింది.దీనికి 20 రోజులు పట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని