logo

GHMC: ఇంటి కొలతలు తప్పాయా.. నోటీసులే!

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 09 Apr 2025 07:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జీఐఎస్‌ సర్వేతో నిర్మాణాలను జల్లెడ పడుతున్న జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఆస్తిపన్ను కట్టని నిర్మాణాలు, తక్కువ కడుతున్న భవనాలు జీఐఎస్‌(భౌగోళిక సమాచార వ్యవస్థ) సర్వేలో లెక్క తేలుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం మేరకు సర్వే పూర్తవగా అందులో 80 వేల నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తిపన్నులో తేడాలు ఉన్నట్లు సర్వేయర్లు గుర్తించారు. అందులో పన్ను కట్టని నిర్మాణాలే 20 వేల వరకు ఉన్నాయి. బల్దియా ఐటీ విభాగం ఆయా నిర్మాణాల జాబితాను ఇటీవల కమిషనర్‌ ఇలంబర్తి ముందుంచగా..అన్నింటికీ చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని, యజమానుల నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు జోనల్‌ కమిషనర్లు చర్యలు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 213 కింద నోటీసులు జారీకి శ్రీకారం చుట్టారు.

అయిదు లక్షలకు పైగా భవనాలకు.. 

జీఐఎస్‌ సర్వే ఏడాది కిందట మొదలైంది. డ్రోన్‌తో నగరం మొత్తాన్ని చిత్రీకరించారు. నగర భౌగోళిక పటాన్ని రూపొందించారు. ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతోంది. పూర్తయిన 20 శాతం ఇంటింటి సర్వేలో 80 వేల భవనాలు లెక్క తేలాయి. నగరం మొత్తాన్ని సర్వే చేస్తే.. అయిదు లక్షలకుపైగా భవనాలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అంచనా.

నోటీసులిస్తూనే..: సర్వేయర్లు గుర్తిస్తున్న సమాచారంలో కూడా లోపాలు ఉండొచ్చనే ఉద్దేశంతో గుర్తించిన ప్రతి ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలని, ఆ వివరాలను సంబంధిత సహాయ మున్సిపల్‌ కమిషనర్‌(ఏఎంసీ) ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయాలని కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. నోటీసుకు 15 రోజుల్లోపు యజమాని వివరణ ఇవ్వాలి. యజమాని ఇచ్చే వివరణ ఆధారంగా సంబంధిత బిల్‌ కలెక్టర్‌ లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఉప కమిషనర్‌కు నివేదిక ఇస్తారు. స్పందించకపోతే   విచారణ లేకుండానే పన్ను మదింపు జరిగిపోతుంది.  నోటీసులపై పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి కోసం ఏదైనా ఒక రోజును కేటాయించి, సంబంధిత ఉప కమిషనర్‌ యజమాని అభ్యంతరాలపై విచారణ జరపాలని సూచించారు.  నోటీసు జారీ, దాని వివరాలను యజమాని ఫోన్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. 

Tags :
Published : 09 Apr 2025 07:20 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని