Year Ender 2023: మురిపించిన చంద్రయాన్‌.. మెలిపెట్టిన ప్రపంచకప్‌: 2023 పంచిన జ్ఞాపకాలివే..!

2023.. మనకు ఓ మిశ్రమ కాలం. రోమాలు నిక్కబొడుచుకునే ఘనతలు ఒకవైపు, పెను విషాదాలు నింపిన ఘటనలు మరోవైపు. కొత్త ఏడాదిలోకి కాలుమోపేముందు అవేంటో చూద్దామా..!

Updated : 28 Dec 2023 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో ఏడాది చరిత్రగా మారే సమయం ఆసన్నమైంది. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ 2023 భారత్‌కు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. చంద్రయాన్‌, జీ20 సదస్సుతో భారత్‌ పేరు అంతర్జాతీయంగా మార్మోగగా.. మణిపుర్ ఘర్షణలు, ఒడిశా ఘోర రైలు ప్రమాదం, రెజ్లర్ల ఆందోళన కలుక్కుమనిపించాయి. ఇలా మధురానుభూతులతో పాటు చేదు గుళికలను మిగిల్చిన ఈ ఏడాదిని ఓ సారి గుర్తుచేసుకుందాం..!

రోడ్డెక్కిన కుస్తీయోధులు..

లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు జనవరి నెలలో దిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (UWW).. డబ్ల్యూఎఫ్‌ఐపై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసి, మరలా ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో ఉద్వేగపూరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించగా.. ఇంకొందరు అవార్డులు వెనక్కి ఇచ్చారు.

రాహుల్‌పై అనర్హత వేటు..

సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై మార్చి నెలలో అనర్హత వేటు పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన 24 గంటల వ్యవధిలోనే లోక్‌సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయపోరాటం అనంతరం దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుమారు ఐదు నెలల తర్వాత రాహుల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

జనాభాలో భారత్‌ నంబర్‌ వన్‌..

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ (India) అవతరించింది. అప్పటివరకు నంబర్‌ వన్‌గా ఉన్న చైనాను దాటేసి.. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. చైనా రెండో స్థానంలో నిలిచింది. 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పట్నుంచి అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కి నెట్టింది. జనాభా విషయంలోనూ భారత్‌పై చైనా అక్కసు వెళ్లగక్కింది. తమవద్ద ఇప్పటికీ 90 కోట్ల మంది ప్రతిభ కలిగిన కార్మికులు ఉన్నారని పేర్కొంది. జనాభా పెరిగినా వారిలో ప్రతిభ ఉండాలిగా అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఉలిక్కిపాటుకు గురిచేసిన మణిపుర్ ఘటన..

జాతుల మధ్య వైరంతో మే నెలలో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు (Violence in Manipur) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మైతేయిలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని  పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్‌ చేశాయి. ఇది కాస్తా తీవ్ర ఘర్షణలకు దారితీయడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మహిళలు బృందాలుగా ప్రముఖుల ఇళ్లపై దాడి చేసి, నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఒకఎత్తైతే.. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనతో యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇంటర్నెట్ ఆంక్షలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి కాస్త కుదుటపడింది.

భారత్‌కు కొత్త పార్లమెంట్‌ భవనం..

ఈ అమృతకాలంలో భారత్‌కు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ప్రారంభించారు. ద్రవిడ సంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్‌ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠాపన చేశారు.

పెను విషాదం నింపిన ఒడిశా రైలు దుర్ఘటన..

ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్‌ 2 రాత్రి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్‌ రైలు, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటన (Odisha Train Tragedy) దేశ వ్యాప్తంగా పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 296 మంది బలయ్యారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడం, వాటి మధ్య ఛిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఆ విపత్తు వేళ స్థానికులు ప్రదర్శించిన మానవత్వం హృదయాలను కదిలించింది. గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువత ఆసుపత్రికి తరలివచ్చి సాయం అందించారు.

రోమాలు నిక్కబొడుచుకున్న మూమెంట్‌.. చంద్రయాన్‌-3

ఆగస్టు నెలలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని దక్షిణ ధ్రువంపై కాలుమోపి విజయ గీతిక వినిపించింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో ఆ రెండు నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయాయి. చంద్రయాన్‌-3 సురక్షిత ల్యాండింగ్ జరిగిన కొద్దిరోజులకు.. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ISRO) ‘ఆదిత్య ఎల్‌1’ ను ప్రయోగించింది. జనవరి 6న ఇది గమ్యస్థానానికి చేరుకోనుంది.

జీ20..అధ్యక్ష బాధ్యతలు సగర్వంగా నిర్వహించి..

సెప్టెంబర్‌ నెలలో భారత్‌ అధ్యక్షతన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరిగింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ నినాదంతో సభ్యదేశాలతో పాటు పలు మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ‘దిల్లీ డిక్లరేషన్‌’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడాన్ని భారీ విజయంగా అభివర్ణించారు. దీని నిర్వహణపై అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు ప్రశంసలు దక్కాయి. మనదేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్ఠాత్మక భారత్‌-పశ్చిమాసియా-తూర్పు ఐరోపా ఆర్థిక నడవా విషయంలో ఈ సదస్సులో అవగాహన ఒప్పందం కుదరడం కీలక పరిణామం.

క్రికెట్‌ ప్రపంచకప్‌.. మిస్‌..!

ఈ నవంబర్‌ నెల భారత క్రికెట్ అభిమానులకు అంతులేని నిరాశను మిగిల్చింది. వన్డే ప్రపంచకప్‌ (ICC World Cup 2023)లో ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి.. వికెట్ల వేటలో దూసుకుపోయి.. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టి జైత్రయాత్రను కొనసాగించిన రోహిత్‌ సేన ఆఖరి మెట్టుపై భంగపడింది. పరాజయం పాలై కంగారులకు ఆరో ప్రపంచకప్‌ సమర్పించుకొంది. కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత్‌కు కప్పు అందించాలనుకున్న రోహిత్ స్వప్నం చెదిరిపోయింది.

కలవరపెట్టి.. సుఖాంతమైన ఆపరేషన్ టన్నెల్‌..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సొరంగం (Uttarakhand Tunnel) పాక్షికంగా కుప్పకూలడంతో 41 మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. సహాయక చర్యలకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి, 17 రోజుల పాటు విరామం ఎరుగక శ్రమపడ్డ సహాయక బలగాల కష్టానికి ఫలితం దక్కింది. చివరకు ‘ర్యాట్‌ హోల్‌ మైనర్ల’ నైపుణ్యంతో ఆ కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

భద్రతా వైఫల్యం.. మూకుమ్మడి సస్పెన్షన్లు

శీతాకాల పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభ (Loksabha)లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం అలజడి సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందంటూ సభాపతులు వారిపై వేటు వేశారు. ఒక సెషన్‌లో 146 మందిపై సస్పెన్షన్ విధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మరికొన్ని..

స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపించి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కలకలం సృష్టించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌లో వెలువడగా.. మూడింట ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను మించి భాజపా రాణించింది. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో కాషాయ జెండా రెపరెపలాడింది. మరి రాబోయే కొత్త సంవత్సరం ఎలాంటి సంతోషాలు, సవాళ్లను మనముందు ఉంచుతుందో చూడాలి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని