Siddaramaiah: విప్రో క్యాంపస్‌ నుంచి వాహనాలను అనుమతించండి: అజీమ్‌ ప్రేమ్‌జీకి సీఎం లేఖ

Eenadu icon
By National News Team Published : 23 Sep 2025 15:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో రద్దీని నియంత్రించేందుకు సిద్ధరామయ్య (CM Siddaramaiah) సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ (Azim Premji)కి సీఎం లేఖ రాశారు. బెంగళూరులోని విప్రో క్యాంపస్‌ (Wipro campus) లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ 30శాతం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కొద్ది మొత్తంలో వాహనాలను అనుమతించినా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు. 

ఐటీ సంస్థలకు నెలవైన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు (Traffic Congestion) తలెత్తుతుండడంపై ప్రయాణికులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ‘బ్లాక్‌బక్‌’ అనే కంపెనీ సీఈవో రాజేశ్‌ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ‘గతంలో ఇంటినుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’ అంటూ రాజేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుపై పలువురు నేతలు సైతం స్పందిస్తుండడంతో రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. 

బెంగళూరులో గుంతల రోడ్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ (Traffic Congestion)ని తగ్గించడానికి  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరులోని అన్ని రహదారులపై మరమ్మతులు చేయడానికి అధికారులకు నెల రోజుల గడువు విధించారు. గడువు లోపు పనులు పూర్తి చేయకపోతే చీఫ్‌ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీకి లేఖ రాశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు