Mumbai AirPort: తప్పిన పెనుప్రమాదం: విమానం టేకాఫ్‌ కాకముందే.. మరో విమానం ల్యాండింగ్‌..!

ముంబయి ఎయిర్‌ పోర్టులో శనివారం పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఏక కాలంలో ఒకే రన్‌వే పైకి వచ్చాయి. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. 

Updated : 09 Jun 2024 19:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: వందల మంది ప్రయాణికులకు శనివారం ముంబయి విమానాశ్రయంలో (Mumbai AirPort) పెనుప్రమాదం తప్పింది. ఓ ఇండిగో ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అవుతోంది. రెండింటికి మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బందిని విధుల నుంచి తప్పించింది.  

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. రెండు విమానాలు ఒకే రన్‌వేపై ప్రయాణిస్తున్నాయి. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్‌ అవుతుండగా.. అదే సమయంలో ఎయిర్‌ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది. 

ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. తమ పైలట్‌ ముంబయి ఎయిర్‌ పోర్టు ఏటీసీ సూచనలను తూచా తప్పకుండా పాటించాడని పేర్కొంది. ‘‘జూన్‌ 8వ తేదీన ఇండిగో 6ఈ6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ లభించింది. మాకు ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ప్రొసిజర్‌ ప్రకారం ఈ ఘటనపై మేం రిపోర్టు చేశాం’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. 

మరో వైపు ఎయిర్‌ ఇండియా కూడా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. ‘‘ఏఐ657 తిరువనంతపురం వెళ్లే విమానానికి ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే బయల్దేరాం. ఈ క్రమంలో సూచనల ప్రకారం మా విమానం టేకాఫ్‌ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్‌ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని