ఖలిస్థాన్‌ అనుకూలుర ధ్వంసరచన.. లండన్‌లో త్రివర్ణ పతాకానికి అగౌరవం

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు సాగుతున్న వేళ పలుదేశాల్లో ఖలిస్థాన్‌ అనుకూలురు భారత వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారు.

Published : 21 Mar 2023 03:18 IST

శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌పై దాడి.. ఆస్ట్రేలియా పార్లమెంటు ముందు ఆందోళన
అమెరికాకు తీవ్ర నిరసన తెలిపిన మోదీ సర్కారు
భారత రాయబార కార్యాలయానికి పటిష్ఠ బందోబస్తు కల్పించిన బ్రిటన్‌

లండన్‌, వాషింగ్టన్‌, కాన్‌బెర్రా, దిల్లీ: ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు సాగుతున్న వేళ పలుదేశాల్లో ఖలిస్థాన్‌ అనుకూలురు భారత వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారు. ఆదివారం బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద గల త్రివర్ణ పతాకాన్ని దించేయగా, అమెరికాలో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఏకంగా దాడికే దిగారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో పార్లమెంటు ముందూ పెద్దఎత్తున నిరసన నిర్వహించారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్థాన్‌ మద్దతుదారులు త్రివర్ణ పతాకాన్ని అగౌరపరచడంపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. రాయబార కార్యాలయానికి భద్రతను కట్టుదిట్టం చేసింది. విధ్వంసానికి దిగిన వారిలో ఓ అనుమానిత వ్యక్తిని స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ జాతీయ జెండాను అవమానించిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, విచారించాలని బ్రిటన్‌ను భారత్‌ కోరిన నేపథ్యంలో ఆ దేశం చర్యలు చేపట్టింది. ‘ఖలిస్థాన్‌ అనుకూలురు కొందరు భారత రాయబార కార్యాలయంపై దాడికి యత్నించారు. దాన్ని వమ్ము చేశాం’ అని లండన్‌లోని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కార్యాలయంపై భారత సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకం రాజసంగా ఎగురుతోందని తెలిపారు. ఆందోళనకారుల దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని మెట్రోపాలిటన్‌ పోలీసులు చెప్పారు.

ఇనుప రాడ్లతో దాడి

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై ఆదివారం కొందరు ఖలిస్థాన్‌ అనుకూలవాదులు దాడికి పాల్పడ్డారు. ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు చేస్తూ వారు భద్రతా వలయాన్ని ఛేదించి కార్యాలయ ఆవరణలో రెండు ఖలిస్థాన్‌ జెండాలను అమర్చారు. వాటిని కాన్సులేట్‌ సిబ్బంది తొలగించారు. కొంతసేపటికి కోపోద్రిక్తులైన కొందరు అక్కడకు చేరుకుని అమృత్‌పాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘‘ఫ్రీ అమృత్‌పాల్‌’’ అంటూ కాన్సులేట్‌ భవనం గోడలపై పెయింట్‌తో రాశారు. ఈ దృశ్యాలన్నింటినీ తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.  శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడంపై దిల్లీలోని అమెరికా దౌత్యాధికారికి మన దేశం తీవ్ర నిరసన తెలిపింది. శానిఫ్రాన్సిస్కో ఘటనను ఖండిస్తూ.. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు భారత అమెరికన్లు డిమాండ్‌ చేశారు. లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

* ఆస్ట్రేలియాలోని ఖలిస్థాన్‌ మద్దతుదారులు రాజధాని కాన్‌బెర్రాలోని పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

బ్రిటన్‌ హై కమిషన్‌ ఎదుట సిక్కుల నిరసన

ఖలిస్థాన్‌ అనుకూల నిరసనకారులు లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం వద్ద భారత జాతీయ జెండాను లాగివేయడంపై పలువురు సిక్కులు సోమవారం దిల్లీ చాణక్యపురిలోని బ్రిటన్‌ హై కమిషన్‌ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని