పురుషుడిలా మారిన ఉపాధ్యాయురాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు లింగమార్పిడి చేయించుకొని పురుషుడిలా మారారు. సంబంధిత ధ్రువీకరణ పత్రం కూడా పొందారు.

Updated : 30 Jun 2023 08:25 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు లింగమార్పిడి చేయించుకొని పురుషుడిలా మారారు. సంబంధిత ధ్రువీకరణ పత్రం కూడా పొందారు. ఖుదాగంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని నవాదా గ్రామానికి చెందిన సరితాసింగ్‌.. భారత స్వాతంత్య్ర పోరాటంలో అమరుడైన ఠాకూర్‌ రోషన్‌ సింగ్‌ మునిమనవరాలు. దివ్యాంగురాలైన ఆమెకు చిన్నప్పటి నుంచి పురుషుల దుస్తులు ధరించడం, వారిలా హెయిర్‌స్టైల్‌ చేసుకోవడం ఇష్టం. 2020లో సరితకు ప్రాథమిక విద్యా మండలిలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. అదే ఏడాది- లింగమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకొని.. లఖ్‌నవూలో హార్మోన్‌ మార్పిడి థెరపీ చేయించుకున్నారు. దాంతో గొంతు మారడం, ముఖంపై గడ్డం రావడం వంటి మార్పులు కనిపించాయి. తాజాగా 3 నెలల కిందట మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిగా శరత్‌ సింగ్‌గా మారారు. షాజహాన్‌పుర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఉమేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ నుంచి లింగమార్పిడి ధ్రువీకరణ పత్రం కూడా అందుకున్నారు. దివ్యాంగురాలు కావడంతో సరిత ఎక్కువ సమయం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆమె అవసరాలన్నీ సవితా సింగ్‌ అనే యువతి చూసుకునేది. చదువులో కూడా అండగా ఉండేది. ఈ నేపథ్యంలో సవితను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రస్తుతం శరత్‌ సింగ్‌ నిర్ణయించుకున్నారు. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని