Chandrayaan-3: చందమామపై దుమ్ములేపిన విక్రమ్‌

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయి.

Updated : 28 Oct 2023 07:39 IST

ల్యాండింగ్‌ సమయంలో గాల్లోకి ఎగిసిన 2 టన్నుల మట్టి

దిల్లీ: భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ‘ఎజెక్టా హాలో’ అని పిలుస్తారు. విక్రమ్‌ ల్యాండర్‌.. ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలను.. చంద్రుడి కక్ష్యలో ఉన్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా సాయంతో హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ల్యాండింగ్‌కు కొద్ది గంటల ముందు, ఆ తర్వాత ఇది తీసిన ఫొటోలను పోల్చి చూశారు. విక్రమ్‌ కిందకి దిగేటప్పుడు డిసెంట్‌ స్టేజ్‌ రాకెట్ల ప్రజ్వలన కారణంగా జాబిల్లి ఉపరితలం నుంచి భారీగా ధూళి పైకి ఎగిసినట్లు తేలింది. ఫలితంగా అక్కడ 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చెల్లాచెదురైనట్లు ఇస్రో వివరించింది. ఇలాంటి ఘటనల సమయంలో చంద్రుడి ధూళి స్పందించే తీరుపై కొత్త విషయాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని