Article 370 verdict: 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు నేడే

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

Updated : 11 Dec 2023 10:01 IST

కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
జడ్జిమెంట్‌ను అందరూ గౌరవించాలన్న భాజపా
తీర్పు వ్యతిరేకంగా వచ్చినా శాంతికి విఘాతం కలిగించబోమన్న ఎన్‌సీ

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం (Article 370) రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని భాజపా సూచించింది. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు తమ పార్టీ ఎటువంటి విఘాతం కలిగించబోదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితి ఎదురైతే న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌సీ, పీడీపీలు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ)లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్మూకశ్మీర్‌కు చెందిన పార్టీలు గుప్కార్‌ అలయెన్స్‌గా ఏర్పడ్డాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావచ్చని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా ఆ తీర్పును సోమవారం వెలువరిస్తానని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని