డ్రగ్స్‌ జప్తు కేసులో మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.

Published : 28 Mar 2024 04:37 IST

నేడు శిక్ష ఖరారు

పాలన్‌పుర్‌: కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. 1996లో గుజరాత్‌లోని బనాస్‌కాంఠాలో మత్తుపదార్థాల (డ్రగ్స్‌) జప్తునకు సంబంధించి రాజస్థాన్‌ న్యాయవాదిని తప్పుడు కేసులో ఇరికించారన్నది అభియోగం. ఈ కేసులో సంజీవ్‌ భట్‌ను బుధవారం జిల్లా అదనపు సెషన్స్‌  కోర్టు జడ్జి జె.ఎన్‌.ఠక్కర్‌ దోషిగా తేల్చారు. గురువారం శిక్షను ఖరారు చేస్తామని తెలిపారు. న్యాయవాది ఉన్న హోటల్‌ గదిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు 1996లో పోలీసులు తెలిపారు. అయితే, రాజస్థాన్‌లోని ఓ వివాదాస్పద ఆస్తిని బదిలీ చేయించడం కోసం ఒత్తిడి తెచ్చే చర్యలో భాగంగా న్యాయవాది సుమేర్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌పై కేసు బనాయించారన్నది ఆరోపణ. ఈ కేసులో 2018 సెప్టెంబరులో సంజీవ్‌ భట్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే 1990లో జరిగిన ఓ కస్టడీ మరణానికి అదనపు ఎస్పీగా ఉన్న సంజీవ్‌ భట్‌ కారణమనే అభియోగాలు నమోదయ్యాయి. జామ్‌నగర్‌ కోర్టు 2019లో జీవిత ఖైదు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని