కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు

మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Published : 12 Apr 2024 05:18 IST

దిల్లీ విజిలెన్స్‌ విభాగం ఆదేశాలు

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దిల్లీ ప్రభుత్వ విజిలెన్స్‌ విభాగం వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని వైభవ్‌ కుమార్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్‌ విభాగం దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన్ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసుకు సంబంధించి ఈ నెల 8న వైభవ్‌ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనపై వేటు వేయడం గమనార్హం. తమ పార్టీని సమూలంగా నాశనం చేసేందుకే భాజపా ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆప్‌ దుయ్యబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని