పన్వెల్‌లో నెల రోజులుగా మకాం

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లోని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు.

Published : 16 Apr 2024 04:43 IST

 ఇంటిని అద్దెకు తీసుకున్న నిందితులు
సల్మాన్‌ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పుల ఘటనపై ఓ అధికారి వెల్లడి

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లోని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్‌ ఉంది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. ద్విచక్ర వాహనం పూర్వ యజమానిది కూడా పన్వెల్‌ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తు కోసం డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆ బృందాలను బిహార్‌, రాజస్థాన్‌, దిల్లీలకు పంపారు. కాల్పుల సమయంలో సల్మాన్‌ఖాన్‌ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. మరోవైపు, సల్మాన్‌ ఇంటి ముందు ఎప్పుడూ ఉండే పోలీసు వాహనం కాల్పుల సమయంలో లేకపోవడంపైనా దర్యాప్తు చేస్తున్నారు. ‘‘మౌంట్‌ మేరీ చర్చి దగ్గర మోటారు సైకిల్‌ను వదిలేసిన నిందితులు కొంతదూరం నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ఓ ఆటోలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి బొరివలి వైపు వెళ్లే రైలు ఎక్కారు. కానీ, శాంతాక్రజ్‌ రైల్వేస్టేషన్‌లో దిగి బయటకు వెళ్లిపోయారు’’ అని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం అయిదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఇది ట్రైలర్‌ మాత్రమే: బిష్ణోయ్‌ సోదరుడు

కాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పేరుతో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ‘‘సల్మాన్‌.. నీకు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఇదే చివరి వార్నింగ్‌’’ అని ఆ పోస్ట్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని