మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?

యోగా గురు బాబా రాందేవ్‌, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 24 Apr 2024 04:06 IST

పతంజలిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం

యోగా గురు బాబా రాందేవ్‌, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ మంగళవారం జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనానికి తెలిపింది. ఆ కంపెనీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ స్పందిస్తూ...ఆ విషయాన్ని కోర్టు రికార్డుల్లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ‘క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్‌ సైజునే వాడారా? అంతే సైజులో క్షమాపణలను ప్రచురించారా?’ అని ఆరా తీశారు. దీంతో... బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ విన్నవించారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 30కి వాయిదా వేసింది. పతంజలి కోర్టు ధిక్కార అంశాన్నీ అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను రెండు రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులనూ పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని