ఆప్‌ ఆఫీస్‌ స్థలంపై నిర్ణయం తీసుకోండి

దేశ రాజధాని నగరంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 06 Jun 2024 06:39 IST

కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలకు దిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల కేటాయించలేకపోతున్నామని చెప్పడం కారణంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి ఆప్‌ కార్యాలయానికి భూమిని కేటాయించాలని ఆదేశించింది. ఆప్‌ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాక దిల్లీలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోడానికి స్థలం కేటాయించాలని గతంలో కేంద్రాన్ని కోరింది. జూన్‌ 15లోపు పార్టీ ప్రస్తుత కార్యాలయాన్ని తాము ఖాళీచేయాల్సి ఉందని.. వీలైనంత త్వరగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌ (డీడీయూ మార్గ్‌)లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భూభాగాన్ని తాత్కాలికంగా కార్యాలయ ఏర్పాటుకు కేటాయించాలని ఆప్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం ఆప్‌ కార్యాలయం ఉన్న భూమిని దిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి జూన్‌ 15 వరకు ఆప్‌నకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని