కరోనా కట్టడిలో భారత్‌ భేష్‌

కరోనా కట్టడిలో భారత్‌ మరింత ముందడుగు వేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. దేశంలో ఈనెల 11-17 తేదీల మధ్య కొవిడ్‌ కేసులు 18%, మరణాలు 13% మేర తగ్గినట్టు

Updated : 21 Oct 2021 10:50 IST

వారంలోనే 18% తగ్గిన కేసులు

మరణాలూ 13% దిగువకు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా, దిల్లీ: కరోనా కట్టడిలో భారత్‌ మరింత ముందడుగు వేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. దేశంలో ఈనెల 11-17 తేదీల మధ్య కొవిడ్‌ కేసులు 18%, మరణాలు 13% మేర తగ్గినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ఐరోపా మినహా ప్రపంచంలో మిగతా చోట్ల కూడా కేసుల్లో తగ్గుదల కనిపించినట్టు పేర్కొంది. ఐరోపాలో మాత్రం పాజిటివ్‌ కేసులు 7% మేర పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఆఫ్రికాలోనే కేసులు (18%), మరణాలు (25%) తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 24 కోట్ల మందికి వైరస్‌ సోకగా, 49 లక్షల మంది మృతిచెందినట్టు విశ్లేషించింది.

మరింత తగ్గిన క్రియాశీలక కేసులు...

భారత్‌లో బుధవారం ఉదయం నాటికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,623 మందికి కరోనా సోకింది. ఆరోగ్యం విషమించి మరో 197 మంది మృతిచెందారు. వీటితో కలిపి మొత్తం కేసులు 3,41,08,996కు, మరణాలు 4,52,651కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 1,78,098 క్రియాశీలక కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.10%గా, వారపు సగటు రేటు 1.34%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొవాగ్జిన్‌కు అనుమతులపై చర్చలు

దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసే విషయమై... కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఫోన్‌లో చర్చించారు. కొవాగ్జిన్‌కు సంబంధించి మరికొంత సమాచారం రావాల్సి ఉందని డబ్ల్యూహెచ్‌వో సోమవారం తెలిపింది. ఈ క్రమంలోనే సాంకేతిక సలహా బృందం ఈనెల 26న మరోసారి సమావేశం కానుంది. కొవాగ్జిన్‌కు అనుమతులు మంజూరుచేసే అంశంపై ఈ సందర్భంగా చర్చించనున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ప్రపంచ టీకా కార్యక్రమం ‘కొవాక్స్‌’ నిమిత్తం... సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సరఫరాను పునరుద్ధరించే అంశంపైనా నేతలిద్దరూ సంప్రదింపులు జరిపారు. కరోనా నివారణ, డబ్ల్యూహెచ్‌వో సంస్కరణలు, ఆరోగ్య సంబంధిత అంశాలపై అధనోమ్‌తో సమగ్రంగా చర్చించినట్టు మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. ‘వ్యాక్సిన్‌ మిత్ర’ కార్యక్రమంలో భాగంగా... దేశంలోని మిగులు టీకాలను భారత్‌ త్వరలోనే కొవాక్స్‌ నిమిత్తం ఎగుమతి చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని