దిల్లీ యూనివర్సిటీలో ఘర్షణ
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విడుదల కోరుతూ భగత్ సింగ్ ఛత్రా ఏక్తా మోర్చా (బీఎస్సీఈఎం) గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది.
పలువురు విద్యార్థులకు గాయాలు
దిల్లీ: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విడుదల కోరుతూ భగత్ సింగ్ ఛత్రా ఏక్తా మోర్చా (బీఎస్సీఈఎం) గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం బీఎస్సీఈఎం, ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీలకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. బీఎస్సీఈఎంకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఏబీవీపీకి చెందిన కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. దిల్లీ వర్సిటీ ఆవరణలోని వల్లభ్భాయ్ పటేల్ చెస్ట్ ఇనిస్టిట్యూట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గొడవకు కారణం మీరంటే మీరని రెండు వర్గాలు ఆరోపించుకున్నాయి. వర్సిటీ ఉత్తర క్యాంపస్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో తమ విద్యార్థులు దాడికి గురైనట్లు మోర్చా వెల్లడించింది. చికిత్స కోసం హిందూరావ్ ఆసుపత్రికి చేరుకోగా ఏబీవీపీ సభ్యులు తమను చుట్టుముట్టి చికిత్స అందకుండా అడ్డుకున్నారంది. ఏబీవీపీకి చెందిన మహిళా కార్యకర్త పట్ల అనుచితంగా ప్రవర్తించి తమ కార్యకర్తలతో మోర్చా సభ్యులు గొడవకు దిగినట్లు ఏబీవీపీ ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.