‘ఇస్రో’ గూఢచర్యం కేసులో సుప్రీం కీలకతీర్పు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గూఢచర్యం కేసులో పోలీసు అధికారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Updated : 03 Dec 2022 06:16 IST

నలుగురు పోలీసు అధికారులకు ముందస్తు బెయిలు నిరాకరణ

దిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గూఢచర్యం కేసులో పోలీసు అధికారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ సహా నలుగురు పోలీసులకు కేరళ హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని, బెయిల్‌ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించి 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ దరఖాస్తులపై కోర్టు తదుపరి తీర్పు వెలువడేదాకా నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది. క్రయోజనిక్‌ ఇంజిన్ల తయారీకి సంబంధించిన కీలకపత్రాలను 1994లో విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. అయితే, క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణన్‌పై గూఢచర్యం ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి పోలీసు అధికారులైన గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్‌.జయ్‌ప్రకాశ్‌, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్‌.విజయన్‌, థంపి ఎస్‌ దుర్గా దత్‌పై కేసులు పెట్టింది. వారికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయగా.. దానిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని