మహానగరాల్లో కుంగుతున్న నేల

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 05:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేయడంతోనే సమస్య
దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులకు ముప్పు

దిల్లీ: వాతావరణ మార్పుల వల్ల ఒకవైపు సముద్ర మట్టాలు పెరిగి తీర నగరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. మరోవైపు భూగర్భ జలాలను అధికంగా తోడేయడం వల్ల నగరాలు కుంగిపోతున్నాయి. భారతదేశంలో ఐదు మహానగరాలు ఇలా కుంగుబాటుకు లోనవుతున్నాయని భారత్, అమెరికా పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.... దిల్లీ నగరం ఏటా 51 మిల్లీమీటర్ల మేర, చెన్నై 31.7 మి.మీ, ముంబయి 26 మి.మీ, కోల్‌కతా 16.4 మి.మీ, బెంగళూరు 6.7 మి.మీ చొప్పున కుంగుతున్నాయి. ఈ అయిదు మహానగరాల్లో 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి లోపలికి పోతోంది. 19 లక్షల మంది ప్రజలపై దీని దుష్ప్రభావం పడనుంది. వరదలు, భూకంపాల వల్ల నేల కుంగిపోవడం మరింత తీవ్రమవుతుంది. ఈ ఐదు నగరాల్లో వచ్చే 50 ఏళ్లలో 23,500 భవనాల పునాదులు సడలిపోయే అవకాశం ఉంది. భూగర్భ జలాలను మితిమీరి వినియోగంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా భవనాల నిర్మాణం జరగడం కూడా భూమి కుంగుబాటుకు దారితీస్తోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం మున్ముందు నీటి కొరత వల్ల భూగర్భ జలాలను అతిగా తోడేయవచ్చు. అది భూమి కుంగుబాటును తీవ్రం చేస్తుందని నివేదిక హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని