వైద్యులను కాపాడకపోతే న్యాయవ్యవస్థను సమాజం క్షమించదు

Eenadu icon
By National News Desk Updated : 29 Oct 2025 06:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: వైద్యులను కాపాడుకోలేకపోతే, వారి పక్షాన నిలవకపోతే న్యాయ వ్యవస్థను సమాజం క్షమించబోదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బీమా క్లెయింలను ఇన్సూరెన్స్‌ కంపెనీలు గౌరవించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు వైద్యులు కేవలం లాభాపేక్షతోనే పని చేస్తున్నారనే భావన తప్పని అభిప్రాయపడింది. ప్రైవేటు క్లినిక్‌లు, గుర్తింపులేని ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తూ అదే వ్యాధి సోకి మరణించిన డాక్టర్లు, వైద్య కార్యకర్తల్ని ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ నుంచి మినహాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై తీర్పును రిజర్వు చేస్తూ జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఆర్‌. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వ్యాధి నిర్మూలన కార్యక్రమాల్లో మరణించిన సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా వారు ఆ పోరాటంలో పాల్గొని ఉంటే బీమా సదుపాయానికి అనర్హులని బాంబే హైకోర్టు 2021 మార్చి 9న వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ ప్రదీప్‌ అరోడా అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై కోర్టు విచారణ జరుపుతోంది. ఠాణెలో ఒక ప్రైవేటు క్లినిక్‌ నడుపుతున్న డాక్టరు ఒకరు 2020లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తూ అదే వ్యాధి సోకి మరణించారు. ఆయన ఆసుపత్రిని ప్రభుత్వం కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించని కారణంగా ఆయనకు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద రూ 50 లక్షల బీమా ప్రయోజనం రాదని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Tags :
Published : 29 Oct 2025 06:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు