Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By National News Team Published : 24 Oct 2025 17:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల (Trade Deals) విషయంలో భారత్‌ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని.. హడావిడి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టంచేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్‌ పలు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్నారు.

కొవిడ్‌ (COVID-19) మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతరాయాల తర్వాత 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో వచ్చిన మార్పును పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని ప్రపంచ దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పురుచుకుంటోందని తెలిపారు. దీనివల్ల సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ విధంగా భారత్‌ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉందని.. కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు. 

ఇప్పటికే భారత్‌పై ఉన్న సుంకాల (Tariff)ను అంగీకరిస్తున్నాం కదా అనే కారణంతో మరిన్ని సుంకాలను వేస్తామని బెదిరిస్తే.. ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుందని పీయూష్‌ గోయల్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ భారత్‌పై సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో పీయూష్‌ గోయల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని