Bharat Jodo: అదే అసలైన ‘భారత్‌ జోడో’.. జ్యోతిరాదిత్య సింధియా

రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర’పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్నిదేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్‌ జోడో’గా అభివర్ణించారు.

Published : 29 Nov 2022 01:37 IST

దిల్లీ: రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)’పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని(North East) దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్‌ జోడో’గా అభివర్ణించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని డోనీ పోలో విమానాశ్రయం నుంచి ముంబయి, కోల్‌కతాలకు విమాన సేవలను సోమవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. 2013-14కు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని విమానాశ్రయాలు ఎందుకు నిర్మించలేదు? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

అప్పటివరకు ఈ ప్రాంతంలో తొమ్మిది ఎయిర్‌పోర్టులే ఉండగా.. ఈ ఏనిమిదేళ్లలో 16కు పెంచినట్లు తెలిపారు. ‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో రైలు, విమాన మార్గాల ద్వారా అనుసంధానించడమే నిజమైన ‘భారత్ జోడో’’ అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల పేరు ఎత్తకుండానే మంత్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇటానగర్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ హోలోంగి విమానాశ్రయాన్ని ఇటీవల డోనీ పోలో విమానాశ్రయంగా పేరుమార్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో సుమారు రూ.646 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. పది రోజుల క్రితం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. తాజాగా ముంబయి, కోల్‌కతాలకు విమాన సేవలు మొదలయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు