Delhi: మోదీ వ్యతిరేక పోస్టర్ల కలకలం.. 100 ఎఫ్‌ఐఆర్‌లు, ఆరుగురి అరెస్ట్‌

దేశ రాజధానిలో ప్రధాని మోదీ (Narendra Modi)కి వ్యతిరేకంగా వెలుస్తోన్న పోస్టర్లపై (Posters) దిల్లీ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతోపాటు ఆరుగురిని అరెస్టు చేశారు.

Published : 22 Mar 2023 14:35 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వ్యతిరేకంగా దేశ రాజధానిలో వేల సంఖ్యలో పోస్టర్లు (Posters) వెలవడం కలకలం సృష్టించింది. ‘మోదీ హఠావో దేశ్‌ బచావో’ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిపై చర్యలకు ఉపక్రమించిన దిల్లీ పోలీసులు (Delhi Police).. ఇప్పటివరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

పోస్టర్లకు సంబంధించి ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తోన్న ఓ వ్యానును అడ్డుకున్న పోలీసులు అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉన్న కొన్ని వేల పోస్టర్లను సీజ్‌ చేశారు. అయితే, ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన సమచారం ఆ పోస్టర్లపై లేదని దిల్లీ పోలీస్‌ ప్రత్యేక కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు. ఇప్పటివరకు మోదీకి వ్యతిరేకంగా అంటించిన 2వేల పోస్టర్లను తొలగించామని చెప్పారు.

పోస్టర్ల వ్యవహారంపై పోలీసుల చర్యను ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్న ఆప్‌.. ఆ పోస్టర్లలో అభ్యంతరకరం ఏముందని ప్రశ్నించింది. వీటికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపైనా మండిపడింది. భారత్‌ ప్రజాస్వామ్య దేశమనే విషయం మీకు తెలియకపోవచ్చని.. ఒక్క పోస్టర్‌కే ఎందుకంత భయం అంటూ ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని