President Murmu: రఫేల్‌లో రాష్ట్రపతి గగన విహారం

Eenadu icon
By National News Desk Published : 30 Oct 2025 04:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అంబాలా వాయుసేన స్థావరంలో రఫేల్‌ యుద్ధ విమానం ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అంబాలా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్‌ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె.. దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీంతో- వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2023 ఏప్రిల్‌లో ఆమె అస్సాంలోని తేజ్‌పుర్‌ నుంచి సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన సంగతి గమనార్హం. 2006 జూన్‌లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, 2009 నవంబరులో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభాపాటిల్‌ సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో ప్రయాణించారు. 

జీ సూట్‌లో.. సన్‌గ్లాసెస్‌తో.. 

త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన ముర్ము.. రఫేల్‌లో విహరించడానికి ముందు అంబాలాలో గౌరవ వందనం స్వీకరించారు. జీ సూట్‌లో, సన్‌గ్లాసెస్‌ ధరించి, చేతిలో హెల్మెట్‌ పట్టుకుని పైలట్‌తో ఫొటోలు దిగారు. మన దేశంలో రఫేల్‌ యుద్ధ విమాన తొలి మహిళా పైలట్‌గా ఖ్యాతికెక్కిన స్క్వాడ్రన్‌ లీడర్‌ శివాంగీ సింగ్‌ కూడా రాష్ట్రపతితో ఫొటోలకు పోజిచ్చారు. ముర్ము ప్రయాణించిన యుద్ధ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ అమిత్‌ గెహానీ నడిపారు. ఉదయం 11:27 నిమిషాలకు అది టేకాఫ్‌ అయింది. ప్రయాణంలో సముద్ర మట్టం నుంచి 15 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. దాదాపు గంటకు 700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. రఫేల్‌లో రాష్ట్రపతి విహారాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ అంబాలా స్థావరం నుంచే మరో విమానంలో ప్రయాణించారు. రఫేల్‌లో ప్రయాణంపై రాష్ట్రపతి స్పందిస్తూ.. ఇది తనకు మరువలేని అనుభూతి అని పేర్కొన్నారు. దేశ రక్షణ సామర్థ్యాలపై తన విశ్వాసాన్ని ఈ విహారం మరింతగా ఇనుమడింపజేసిందన్నారు. సందర్శకుల పుస్తకంలో ఈ మేరకు సందేశంతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 

రఫేల్‌ యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఈ ఏడాది మేలో ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా.. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై రఫేల్‌ జెట్లతో భారత్‌ దాడులు జరిపింది. ఈ యుద్ధ విమానంలో ప్రస్తుతం రాష్ట్రపతి గగన విహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని