Pune Car Crash: పుణె కేసులో పోలీసుల మాస్టర్‌ప్లాన్‌ : అడ్డంగా దొరికిపోయిన డాక్టర్లు

పుణెలో జరిగిన పోర్ష్‌కారు ప్రమాదంలో మరో విషయం బయటపడింది. రూ.3 లక్షలకు కక్కుర్తిపడిన వైద్యులే రక్తం నమూనాలు మార్చేశారని పోలీసులు గుర్తించారు. కౌంటర్‌ ఆపరేషన్‌ నిర్వహించి వైద్యులను అరెస్టు చేశారు. 

Updated : 28 May 2024 14:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణెలో ఓ సంపన్న బాలుడు తప్పతాగి హైస్పీడు కారుతో యాక్సిడెంట్‌ (Pune Car Crash) చేసి ఇద్దరు టెకీల ప్రాణాలు తీసిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నిందితుడి రక్తనమూనాలు మార్చేసేందుకు డబ్బు ఎలా, ఎంత చేతులు మారిందన్న విషయం  బయటపడింది. ప్యూన్‌గా పనిచేసే అతుల్‌ ఘట్‌కాంబ్లే ఈ మొత్తం వ్యహారానికి మధ్యవర్తిగా పనిచేసినట్లు తేలింది. అంతేకాదు.. పోలీసులు వీరిని ముందే అనుమానించి కౌంటర్‌ ఆపరేషన్‌ నిర్వహించగా వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సాసూన్‌ ఆస్పత్రి వైద్యులు అజయ్‌ తావ్‌రే, శ్రీహరి హల్నోర్‌, అతుల్‌ను  అరెస్టు చేశారు. 

ఏకంగా డాక్టర్ల రక్తనమూనాలే..

ప్రమాదం జరిగిన రోజు డాక్టర్‌ తావ్‌రే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరింది. ఈ నేపథ్యంలో తావ్‌రే తన ప్లాన్‌ కూడా అతడికి వివరించాడు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే డాక్టర్‌ నమూనాలను ఆ స్థానంలో పెడతామని వెల్లడించాడు. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు బయటపడ కూడదనే ఇలా చేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకొచ్చిన ప్యూన్‌ విచారణ సందర్భంగా ఒక దశలో ఆవేశంతో.. ‘నన్ను ఇరికించారు కదా.. ఎవరినీ వదలను.. అందరినీ లాగుతా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

డాక్టర్‌ శ్రీహరే మార్చేశారు..

ఈ వ్యవహారంపై పుణె పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  ‘‘ప్రమాదం జరిగిన రోజు ఉదయం 11 గంటలకు సాసూన్‌ ఆస్పత్రిలో బాలుడి రక్త నమూనాలు సేకరించాం. కానీ, అక్కడ వాటిని చెత్తబుట్టలో పారేశారు. మరో వ్యక్తి రక్తం తీసి దానిని పరీక్షలకు పంపారు. హెచ్‌వోడీ తావ్‌రే సూచనల మేరకు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీహరి హల్నోర్‌ ఈ పనిచేసినట్లు తేలింది’’ అని వివరించారు. ఇక ఆ పరీక్షల్లో ఆల్కహాలు ఆనవాళ్లు రాలేదు. 

పోలీసులకు ముందే అనుమానం..

సాసూన్‌ ఆస్పత్రిలో తీసిన బ్లడ్‌ శాంపిల్స్‌లను మార్చేసే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు ముందే అనుమానించాయి. దీంతో నిందితుడైన బాలుడి నుంచి ఆదివారం ఉదయం మరో సారి రహస్యంగా రక్తనమూనాను సేకరించి ఆంధ్‌ జిల్లా ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపారు. మే 20వ తేదీన రెండు రక్తనమూనాల స్వాబ్స్‌ను రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. మే 21 బాలుడి తండ్రిని అరెస్టు చేసి అతడి రక్తనమూనాను జన్యు పరీక్షకు సేకరించారు. ఈ మూడు టెస్టుల నివేదికలు మే 26న వచ్చాయి. సాసూన్‌ ఆస్పత్రిలో తీసిన రక్త స్వాబ్‌తో బాలుడి తండ్రి డీఎన్‌ఏ సరిపోలలేదు. పోలీసులు రహస్యంగా ఆంధ్‌ ఆస్పత్రికి పంపిన రెండో రక్తనమూనా స్వాబ్‌తో మ్యాచ్‌ అయింది. ఫలితంగ సాసూన్‌ ఆస్పత్రి వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. 

నిందితుడికి తొలుత నిర్వహించిన భౌతిక పరీక్షల అనంతరం వైద్యులపై అనుమానం వచ్చినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. దీంతోపాటు రక్తనమూనాలు మార్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిందన్నారు.

డాక్టర్ల తీరుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ బృందం సాసూన్‌ ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టనుంది. అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని