Trinamool Congress: ఆ నలుగురు చీఫ్‌లను మార్చండి.. ఈసీ ఆఫీస్‌ ముందు టీఎంసీ నేతల ధర్నా

ప్రతిపక్షాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్‌ఐఏ సంస్థల డైరెక్టర్లను మార్చాలని ఈసీని డిమాండ్‌ చేస్తూ టీఎంసీ నేతలు ధర్నాకు దిగారు.

Published : 08 Apr 2024 18:56 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ñElection Commission) ప్రధాన కార్యాలయం ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) ఎంపీలు, నేతలు 24 గంటల ధర్నాకు దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐటీ, ఎన్‌ఐఏ, ఈడీ డైరెక్టర్లను మార్చాలని డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు డెరిక్‌ ఓబ్రియెన్‌, డోలా సేన్‌, సాకేత్‌ గోఖలే, సాగరిక ఘోష్‌లతో కూడిన 10మంది నేతల బృందం ఈసీ అధికారులను కలిసి తమ డిమాండ్లను వారి ముందు ఉంచారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార భాజపా ఆదేశాల మేరకు తమ పార్టీ నేతల్ని టార్గెట్‌ చేస్తున్నాయని.. అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చొన్న ఎంపీలు, నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

2022 నాటి కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ 2024లో అరెస్టు చేస్తోందని డోలాసేన్‌ అన్నారు. శాంతిభద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఐటీ ఏజెన్సీల చీఫ్‌లను కచ్చితంగా మార్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అలాగే, దిల్లీకి బయల్దేరే ముందు కోల్‌కతా విమానాశ్రయం వద్ద డోలా సేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు కేంద్రంలో భాజపా ఆదేశాలమేరకు పనిచేస్తూ విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎన్‌ఐఏ, ఈడీ, సీబీఐ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్ని టార్గెట్‌ చేస్తూ పనిచేయడం సిగ్గు చేటన్నారు.

రెండేళ్ల క్రితం నాటి ఓ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోల్‌కతాకు తరలిస్తున్న ఎన్‌ఐఏ అధికారుల వాహనంపై ఇటీవల భూపతినగర్‌లో స్థానికులు రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆత్మరక్షణ చర్యగా సీఎం మమతా సమర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు