Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!

ఉత్తర్‌కాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు (Tunnel Operation) అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పటికీ.. చివరకు ర్యాట్‌-హోల్‌ (Rat Hole Mining) పద్ధతిలోనే రెస్క్యూ బృందాలు వారిని రక్షించగలిగాయి.

Published : 28 Nov 2023 21:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు అనేక మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు (Uttarkashi Tunnel Rescue) చేశాయి. భారత సాంకేతికతలతోపాటు అమెరికా నుంచీ తీసుకొచ్చిన అత్యాధునిక మెషిన్లు కూడా సొరంగ మార్గంలో ధ్వంసమయ్యాయి. కానీ, గతంలో నిషేధించిన ఓ పద్ధతే చివరకు దిక్కయ్యింది. అదే ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ (Rat Hole mining). ఆరు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ.. అత్యంత ప్రమాదకరమైన ఈ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు (Tunnel Operation) చేరుకోగలిగాయి. ఇలా 41 మంది ప్రాణాలను కాపాడిన ఈ ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ పద్ధతి ఏంటనే విషయాన్ని ఓసారి గమనిస్తే..

ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌..?

సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌గా (Rat Hole mining) వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్‌ హోల్‌గా పేర్కొంటారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ఈ క్రమంలో నిర్దేశిత బొగ్గు పొరను చేరుకున్న తర్వాత.. బొగ్గును వెలికి తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వకం చేపడతారు. తాళ్లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ.. ఆ శిథిలాలను కొంత దూరంలో డంప్‌ చేస్తారు. అక్కడినుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు. తాజాగా ఉత్తర్‌కాశీ ఆపరేషన్‌లో మాత్రం.. 800 మి.మీ పైపు ద్వారా నిపుణులు లోనికి వెళ్లి తవ్వకాలు చేపట్టారు. వీరికి ఆక్సిజన్‌ అందించే ఏర్పాటు చేశారు. అత్యంత పలుచటి భూ పొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో చేసే మైనింగ్‌లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇతర సాంతకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు.

పర్యావరణ ఆందోళనలు..

ర్యాట్‌-హోల్‌ మైనింగ్‌పై అనేక విమర్శలు, వివాదాలూ ఉన్నాయి. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా లోపలికి వెళ్లే కార్మికులకు సరైన వెంటిలేషన్‌, నిర్మాణ పరంగా రక్షణ లేకపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి ప్రతికూల అంశాలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా తవ్వకాలు చేపట్టిన గనుల్లో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2018లో అక్రమ మైనింగ్‌ చేస్తోన్న ఓ గనిలో ప్రమాదం జరిగి 15 మంది అందులోనే చిక్కుకుపోయారు. 2021లోనూ మరో ఘటనలో ఐదుగురు చిక్కుకుపోయారు. ఇలా కార్మికులతోపాటు పర్యావరణానికి హాని కలిగించే ఈ తరహా విధానాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.

ఎందుకు నిషేధించారు..?

ఈ పద్ధతి శాస్త్రీయమైనది కాదని పేర్కొన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌.. 2014లో దీన్ని నిషేధించింది. అనంతరం 2015లోనూ ఎన్జీటీ తన నిషేధాన్ని సమర్థించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు/ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతుండటాన్ని ప్రస్తావించింది. అయితే, తమ ప్రాంతంలో మైనింగ్‌ కోసం మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎన్జీటీ నిషేధాన్ని ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేశాయి. మేఘాలయాలోనూ ఈ తరహా తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

వీరంతా నిపుణులు..

12 మందితో కూడిన రెండు నిపుణుల బృందాలు సిల్‌క్యారా సొరంగంలో తవ్వకాలు చేపట్టాయి. వీరంతా దిల్లీకి చెందిన నిపుణులు. వీరిలో రాజ్‌పుత్‌ రాయ్‌ అనే నిపుణుడు మీడియాతో మాట్లాడుతూ.. ఒకరు డ్రిల్లింగ్‌ చేస్తుంటే మరొకరు ఆ శిథిలాలను తీసి మూడో వ్యక్తికి అందిస్తారని చెప్పారు. ఆ వ్యక్తి అక్కడున్న ట్రాలీ ద్వారా బయటకు పంపించివేస్తారని అన్నారు. అయితే, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ర్యాట్‌-హోల్‌ మైనింగ్‌ చేసేవారు కాదని.. తవ్వకాల సాంకేతికతలో నిపుణులని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నోడల్‌ అధికారి వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. దాదాపు ఆరు ప్రత్యామ్నాయాల్లో ఆపరేషన్‌ చేపట్టారు. సొరంగంలో సమాంతర తవ్వకం చేపట్టేందుకు 25 టన్నుల ఆగర్‌ యంత్రంతో భారీ ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ.. అది అందులోనే ధ్వంసం కావడం కలవరపాటుకు గురిచేసింది. దీంతో చివరకు మాన్యువల్‌ పద్ధతిలో చేసే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ (Rat Hole Mining)పై ఆధారపడాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు