Supreme Court: ‘కరెంట్‌ చౌర్యం.. హత్యానేరమేం కాదు’: 16ఏళ్ల శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌లో కరెంట్‌ దొంగలించినందుకుగానూ ఓ వ్యక్తికి 18ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో శిక్ష తగ్గించాలంటూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టుల తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

Updated : 16 Dec 2022 15:54 IST

దిల్లీ: విద్యుత్‌ చౌర్యం కేసులో ఓ వ్యక్తికి 18 ఏళ్ల శిక్ష విధిస్తూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుబట్టింది. కరెంట్‌ చోరీ (Power Theft).. హత్యా నేరమేమీ కాదని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం అతడి శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ కేసులో హైకోర్టు సరైన తీర్పు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఇఖ్రామ్‌ అనే వ్యక్తి విద్యుత్‌ చోరీ చేసినందుకు గానూ 2019లో అరెస్టయ్యాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు అతడిపై మొత్తం 9 కేసులు నమోదు చేశారు. దీనిపై 2020లో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు ఈ తొమ్మిది కేసుల్లో అతడిని దోషిగా తేల్చింది. ఒక్కో కేసుకు రెండేళ్ల శిక్ష చొప్పున మొత్తం 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ శిక్షను దోషి ఇఖ్రామ్‌ ఒకేసారి కాకుండా వరుసగా అనుభవించాలని పేర్కొంది.

దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తొమ్మిది కేసుల్లో శిక్షను ఒకేసారి అనుభవించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అందుకు హైకోర్టు అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. కింది కోర్టుల తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇలాంటి పిటిషనర్ల వేదనను వినేందుకే సుప్రీంకోర్టు పనిచేస్తోంది. కేసు చిన్నదా పెద్దదా? అనేది మాకు ముఖ్యం కాదు. విద్యుత్‌ను దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తిని 18ఏళ్ల పాటు జైలుకు పంపిస్తారా? కరెంట్‌ చోరీని హత్యానేరంతో సమానంగా చూడకూడదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసులో దోషి శిక్షను తగ్గించకపోతే అతడి హక్కులను తొలగించినట్లే అని అభిప్రాయపడింది. దోషికి సరైన న్యాయం జరగలేదన్న విషయాన్ని కనీసం హైకోర్టు అయినా గుర్తించాల్సిందని పేర్కొంది. ఈ కేసుల్లో అతడికి ఏకకాల శిక్షను అమలు చేసేందుకు కోర్టు అంగీకరిస్తూ అతడి 18 ఏళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గించింది. కాగా.. ఈ కేసుల్లో అతడు ఇప్పటికే రెండేళ్లకు పైగా శిక్షను పూర్తిచేసుకున్నాడు. తాజా తీర్పుతో అతడు జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని