Aamir Khan: అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్‌ ఖాన్‌

సమయం చాలా విలువైనదని బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు.

Published : 24 Apr 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) తాను అవార్డు వేడుకలకు హాజరుకాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. మొదటిసారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆయన తన చిత్రాల ఫలితాలపై స్పందించారు.

‘నా గత చిత్రాలు రెండూ ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ రెండూ విజయం సాధిస్తాయని ఆశించాను. వీటికి నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. అవి అంచనాలను అందుకోకపోవడంతో మానసికంగా బాధ పడ్డాను. అందుకే కోలుకోవడానికి సమయం పట్టింది. ఇండస్ట్రీలో జరిగే అవార్డు వేడుకలకు హాజరుకావడం నాకు ఆసక్తి ఉండదు. పైగా సమయం చాలా విలువైనది. దాన్ని ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి’ అని చెప్పారు. ఆమిర్‌ఖాన్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ చిత్రంలోని పాటను తాజాగా ‘శ్రీకాంత్’లో రీమేక్‌ చేశారు. దీనిగురించి ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవితాన్ని మలుపుతిప్పిన సినిమాలోని గీతమిది. ఈ ప్రాజెక్టు తొలినాళ్లలో మేమంతా ఇండస్ట్రీకి కొత్తవాళ్లం. నేను, దర్శకుడు మన్సూర్‌ ఎప్పుడూ సినిమాలో లోపాలను మాత్రమే వెతికేవాళ్లం. ఇంకా మెరుగ్గా సన్నివేశాల్ని ఎలా తీర్చిదిద్దాలి అనే చర్చించేవాళ్లం. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారోనని భయంగా ఉండేది. కానీ.. మర్చిపోలేని బహుమతి ఇస్తుందని ఊహించలేదు. నా జీవితంలో ఎప్పటికీ ఒక మైలు రాయిలాంటి చిత్రమిది’ అని చెప్పారు.

ఆమిర్‌ఖాన్‌ ‘లాహోర్‌: 1947’లో నటించేందుకు సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఇందులో సన్నీదేవోల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని