Ajay devgn: ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌తో వస్తున్న హీరో

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ క్రేజీ ఫీట్‌ చేయబోతున్నారు. ఆయన తర్వాత నటించబోయే సినిమాలన్నీ సీక్వెల్స్‌ కావడం గమనార్హం

Published : 04 Apr 2024 00:09 IST

హైదరాబాద్‌: సాధారణంగా ఇండస్ట్రీలో హిట్‌ మూవీలకే సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీలు వస్తాయి. మొదటిభాగం హిట్‌ అయ్యిందంటే, తర్వాత వచ్చే చిత్రాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఒక పక్క హీరోగా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn). హిందీ నటుడిగా తెలుగు వారికి తెలిసినా, ‘RRR’తో మరింత దగ్గరయ్యారు. అజయ్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ ఫీట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తర్వాతి సినిమాల జాబితాలో ఉన్నవి ఎక్కువగా సీక్వెల్స్‌ కావడం గమనార్హం.

ఈ ఏడాది ‘షైతాన్‌’ (Shaitaan) మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘మైదాన్‌’ (Maidaan) తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆయన నటించే చిత్రాలన్నీ దాదాపు సీక్వెల్సే. రాజ్‌కుమార్‌ గుప్త దర్శకత్వంలో ‘రైడ్‌’ మూవీ కొనసాగింపుగా ‘రైడ్‌ 2’ రాబోతోంది. వాణీకపూర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగం అగైన్‌’ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఢమాల్‌ 4’, ‘గోల్‌మాల్‌-5’లకు సంబంధించి కూడా స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘దే దే ప్యార్‌ దే-2’ రాబోతోంది. ఇందులో వయసు అంతరం ఉన్న ప్రేమికుడిగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘సన్ ఆఫ్ సర్దార్’కు కొనసాగింపుగా  మరో మూవీ పట్టాలెక్కనుంది. వర్తమానంలో జరిగే కథతో ఇది ప్రేక్షకుల ముందుకురానుందని బాలీవుడ్‌ టాక్‌. ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘దృశ్యం’ మూవీలకు కొనసాగింపుగా ‘దృశ్యం 3’ని దర్శకుడు జీతూ జోసెఫ్‌ రెడీ చేస్తున్నారు. అక్కడ స్క్రిప్ట్‌ పనులు పూర్తయిన వెంటనే అజయ్‌ బాలీవుడ్‌లోనూ షురూ చేస్తారు.

ఇక లేటెస్ట్‌ హిట్‌ ‘షైతాన్‌’కు కొనసాగింపుగా ‘షైతాన్ 2’ను కూడా తీసుకురావాలని అజయ్‌ భావిస్తున్నారట. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే, ఇది ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న మూవీలు పూర్తయిన తర్వాతే దీన్ని తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ‘షైతాన్‌’కు అజయ్‌ దేవ్‌గణ్‌ నిర్మాతల్లో ఒకరు కావడం గమనార్హం. ఈసారి మాధవన్ పాత్రను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తారట. అమిత్‌శర్మ దర్శకత్వంలో అజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మైదాన్‌’ రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఐదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూవీలో ప్రియమణి, గజరాజ్‌రావ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సయ్యద్‌ అబ్దుల్ రహీం బయోపిక్‌గా దీన్ని రూపొందించారు. అజయ్‌ ఇందులో ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని