Chiranjeevi: వేణూ.. మాకు షాక్‌ ఇస్తే ఎలా?: చిరంజీవి

‘బలగం’ (Balagam) చిత్రబృందాన్ని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. సినిమా బాగుందని ప్రశంసించారు.

Updated : 11 Mar 2023 13:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బలగం’ (Balagam). వేణు టిల్లు (Venu) దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) శనివారం ఉదయం ‘బలగం’ టీమ్‌ను ప్రశంసించారు. తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్‌’ సెట్‌లో ‘బలగం’ టీమ్‌ను కలిసిన ఆయన చిత్రబృందాన్ని సన్మానించారు.

‘‘కంగ్రాట్స్‌ వేణు. చిత్రాన్ని చక్కగా రూపొందించావు. ఇంత బాగా సినిమా చేసి మాకు షాకులు ఇస్తే ఎలా? (నవ్వులు). నిజాయతీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌ ఉన్నప్పటికీ నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని 100 శాతం చూపించావు.  వేణు గతంలో ‘జబర్దస్త్‌’ వేదికపై ఓ స్కిట్‌ చేశాడు. వేణుకు ఇంత టాలెంట్‌ ఉందా? అని అతడిపై నాకు గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక.. తన టాలెంట్‌ని మరోసారి నిరూపించుకున్నాడనిపించింది’’ అని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ‘బలగం’ హీరో ప్రియదర్శి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ‘‘చిరు అన్నయ్యా.. మీ సినిమాలు చూసి ఎన్నో సందర్భాల్లో నేను స్ఫూర్తి పొందాను. అలాంటి నేను ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమాభిమానాన్ని పొందడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ‘బలగం’ కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒకరోజు మీతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని