Drishyam: రీమేక్‌ విషయంలో ‘దృశ్యం’ రికార్డు..

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఘన విజయం అందుకున్న ‘దృశ్యం’ సిరీస్‌ చిత్రాలు కొరియన్‌లో రీమేక్‌ కాబోతున్నాయి. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

Published : 21 May 2023 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రీమేక్‌ అయిన అన్ని భాషల్లోనూ ఘన విజయం అందుకున్న చిత్రం ‘దృశ్యం’ (Drishyam). తొలుత మలయాళంలో రూపొందిన ఈ సినిమా అదే పేరుతో తెలుగు (Drushyam), హిందీలో, ‘దృశ్య’ పేరుతో కన్నడలో, ‘పాపనాశనం’ పేరుతో తమిళ్‌లో తెరకెక్కి సత్తా చాటిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా విజయవంతమైంది. ఇప్పుడు ఈ ‘దృశ్యం’ సిరీస్‌ చిత్రాల కథలు కొరియన్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇండియన్‌ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌, దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ఆంథాలజీ స్టూడియోస్‌ సంయుక్తంగా ‘దృశ్యం’ సినిమాలను కొరియన్‌లో రీమేక్‌ చేయబోతున్నాయి. ‘కేన్స్‌ ఫెస్టివల్‌’ వేదికపై ఈ ప్రకటన వెలువడింది. కొరియన్‌ చిత్ర పరిశ్రమలో రీమేక్‌ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించింది.

ముందుగా.. ‘దృశ్యం’ సినిమాని మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేశ్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా, పార్ట్‌ 2ను జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేర్వేరు దర్శకులు వాటిని రూపొందించారు. తమిళ్‌ విషయానికొస్తే.. కమల్‌హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రధారులు. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. కథానాయకుడు సినిమా తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని ఎలా కాపాడాడన్నది ఆసక్తికరం. త్వరలోనే మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని