Chiranjeevi: అమెరికాలో చిరంజీవికి సన్మానం.. అభిమానులనుద్దేశించి హీరో ఏమన్నారంటే?

ప్రముఖ హీరో చిరంజీవిని అమెరికాలోని ఆయన అభిమానులు సన్మానించారు.

Published : 19 Feb 2024 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi)ని అక్కడి అభిమానులు సన్మానించారు. ఇటీవల ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా లాస్‌ ఏంజిల్స్‌ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ పాల్గొని సందడి చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నాకొచ్చిన ఈ అవార్డును మీకొచ్చినట్లుగా భావించడం చాలా సంతోషంగా ఉంది. పురస్కారం వరించినప్పుడు ఆనందమే. ఆ గుర్తింపు వల్ల నాతోపాటు మీరంతా హ్యాపీగా ఉన్నారు. ఇంతకుమించిన అవార్డేముంటుంది’’ అని పేర్కొన్నారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనతోపాటు పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని సత్కరించిన విషయం తెలిసిందే.

సతీసమేతంగా చిరంజీవి కొన్నిరోజుల క్రితమే అమెరికా వెళ్లారు. తమను ఆహ్వానించిన వేడుకల్లో పాల్గొని, సంబంధిత ఫొటోలను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అక్కడినుంచి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రీకరణలో పాల్గొంటారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. త్రిష కథానాయిక. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని