Vidya Balan: ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్‌

తన తదుపరి చిత్రం ‘దో ఔర్‌ దో ప్యార్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్‌ (Vidya Balan). 

Published : 20 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యాబాలన్‌, ప్రతిక్‌ గాంధీ, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దో ఔర్‌ దో ప్యార్‌’. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్నిరోజుల నుంచి విద్యాబాలన్‌ వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ దర్శకుడిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అతడికి మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పారు. తన చిత్రానికి మంచి ఆదరణ రావాలనే ఉద్దేశంతో అతడు వింతగా ప్రవర్తించాడన్నారు.

‘‘నేను కథానాయికగా నటించిన ఓ సినిమా సెట్‌లో చోటుచేసుకున్న సంఘటనను ఎప్పటికీ మర్చిపోను. చిత్ర దర్శకుడికి కాస్త మూఢవిశ్వాసాలు ఎక్కువ. తన చిత్రం విజయం అందుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 42 రోజులపాటు ఒకే షార్ట్ ధరించాడు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. వేరే వాళ్ల ద్వారా విషయం తెలిసి షాకయ్యా. తీరా చూస్తే ఆ సినిమా ఘోర పరాజయం అందుకుంది. ఆ దర్శకుడెవరు? సినిమా ఏమిటి? అనేది ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు’’ అని అన్నారు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తులను ఎంతోమందిని చూశానన్నారు. ఒక నిర్మాత కూడా ఇలాగే ప్రవర్తించారన్నారు. ‘‘ఆ నిర్మాత నన్ను బాధపెట్టేలా మాట్లాడారు. షూట్‌ మొదలైన కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. నా జాతకం తన వద్ద ఉందని, నేనొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఆయన మీడియాతో చెప్పారు’’ అని తెలిపారు.

అనంతరం విద్యా తన భర్త సిద్ధార్థ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మా జనరేషన్‌లో చాలామంది డేటింగ్‌ యాప్స్‌ సాయంతో భాగస్వామిని ఎంచుకున్నారు. వాటి సాయం లేకుండా నా జీవిత భాగస్వామిని కలుసుకున్నందుకు సంతోషంగా భావిస్తున్నా. ఇన్నేళ్ల మా బంధంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడ్డాం. ఎప్పటికప్పుడు మా బంధం మరింత బలపడుతూనే ఉంది. మా వివాహ ప్రథమ వార్షికోత్సవం నాడు కేకు తయారుచేశా. ఆయన నన్నెంతో మెచ్చుకున్నారు. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోను’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని