Viduthalai: అప్పుడు ‘కాంతార’.. ఇప్పుడు ‘విడుతలై’.. అలా తెలుగు ప్రేక్షకుల ముందుకు

విజయ్‌సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విడుతలై పార్ట్‌ 1’. ఈ సినిమా త్వరలోనే తెలుగులో విడుదలకానుంది.

Published : 04 Apr 2023 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడలో హిట్‌గా నిలిచిన ‘కాంతార’ (Kantara)ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంస్థ గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌. ఆ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తమిళ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందుతోన్న ‘విడుతలై పార్ట్‌ 1’ (Viduthalai Part 1) సినిమాని ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు ఆ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind). ఈ మేరకు ‘విడుతలై’ చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌, నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌లను ఆయన కలిశారు. సంబంధిత ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘కాంతార’ తర్వాత ‘మాలికాపురం’ (మలయాళం) సినిమాని తెలుగులో విడుదల చేసి, మంచి స్పందన దక్కించుకుంది ‘గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌’. దాంతో ఆ సంస్థ నుంచి విడుదలయ్యే చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.

విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), సూరి (Soori) కథానాయకులుగా రూపొందిన ‘విడుతలై పార్ట్‌ 1’ మార్చి 31న తమిళ్‌లో విడుదలైంది. పోలీసు కానిస్టేబుల్‌ కథతో పీరియాడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 23 కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. ఇంతకాలం కమెడియన్‌గా అలరించిన సూరి సీరియస్‌ పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని