ETV Win: ఈ రోజు నుంచే సరికొత్తగా

డిజిటల్‌ ప్రపంచంలో మరో కొత్త అధ్యాయానికి ఈ రోజే శ్రీకారం చుడుతోంది ఈటీవీ. ఎప్పుడైనా, ఎక్కడైనా కోరుకున్న కార్యక్రమాల్ని వీక్షించేందుకు వీలుగా ‘ఈటీవీ విన్‌’ ఓటీటీ వేదికను సరికొత్తగా ప్రేక్షకులకు అందిస్తోంది.

Updated : 22 Mar 2023 11:10 IST

డిజిటల్‌ ప్రపంచంలో మరో కొత్త అధ్యాయానికి ఈ రోజే శ్రీకారం చుడుతోంది ఈటీవీ. ఎప్పుడైనా, ఎక్కడైనా కోరుకున్న కార్యక్రమాల్ని వీక్షించేందుకు వీలుగా ‘ఈటీవీ విన్‌’ ఓటీటీ వేదికను సరికొత్తగా ప్రేక్షకులకు అందిస్తోంది. అటు మొబైల్‌ ఫోన్‌లోనూ, ఇటు టెలివిజన్‌లోనూ కూడా ‘ఈటీవీ విన్‌’ తెలుగు వారిని మురిపించి మైమరపించబోతోంది.

ఈటీవీ విన్‌ - ఇది ఇంటిల్లిపాదికీ వినోదాల విందు భోజనం. సరదాలు కోరుకునే పిల్లలకి, సీరియల్స్‌ కావాలనుకునే మహిళలకి, సస్పెన్స్‌ - థ్రిల్స్‌ ఇష్టపడే యువతరానికి, కామెడీ అంటే చెవికోసుకునే హాస్యప్రియులకి, మధుర గీతాల్ని ఆస్వాదించే సంగీత అభిమానులకి, ఆనాటి ఆణిముత్యాలని ఆరాధించే చిత్ర ప్రేమికులకి అందరికీ అన్నీ అందిస్తుంది విన్‌.
తెలుగులో విడుదలైన సరికొత్త చిత్రాలను ‘వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌’గా ఈటీవీ విన్‌ అందించబోతోంది. ఇటీవలే ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘పంచతంత్రం’ చిత్రం ఈ రోజు నుంచి విన్‌లో ప్రసారమవుతోంది.
విశేషం ఏమిటంటే ప్రతి నెలా ఈటీవీ ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఒరిజనల్‌ మూవీ కనువిందు చెయ్యబోతోంది. సినిమా థియేటర్లలో కానీ, టెలివిజన్‌లో కానీ రాని ఈ స్పెషల్‌ మూవీలలో రవిబాబు పర్యవేక్షణలో రూపొందించిన ‘అసలు’ లాంటివి నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ‘అసలు’ ఏప్రిల్‌ 5న విడుదల కాబోతోంది. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు ఈ వరుసలో
రాబోతున్నాయి.

ఈటీవీ విన్‌ ప్రేక్షకుల కోసమే రూపొందించిన వెబ్‌సిరీస్‌ ఈ యాప్‌లో మరో ప్రత్యేకత. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి పర్యవేక్షణలో ‘రైటో లెఫ్టో’ సిరీస్‌ ఈరోజు నుంచే అలరించబోతోంది.

ఇక చలనచిత్రాలను ప్రేమించే వారికి ఈటీవీ విన్‌ ఒక పండగే. తెలుగు చలన చిత్ర అతిరథ మహారథులు నిర్మించిన, నటించిన 500లకు పైగా అపురూప చిత్రాలను తక్షణం వీక్షించి ఆనందించే అవకాశం ఈటీవీ విన్‌ ప్రేక్షకుల సొంతం.

ప్రతిరోజూ ఈటీవీ సీరియల్స్‌, షోస్‌ చూసే కోట్లాది తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేక కానుకను ఇస్తోంది విన్‌. ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే ధారావాహికల ఎపిసోడ్లు, కామెడీ-మ్యూజిక్‌-డ్యాన్స్‌-గేమ్‌ షోలు...అన్నీ ప్రసారమయ్యే రోజు ఉదయం 6గంటల నుంచే విన్‌లో అందరికన్నా ముందుగా చూడవచ్చు.

మంచి కార్యక్రమాలకి మనసారా స్వాగతం పలికే తెలుగు ప్రేక్షకులకి ఈటీవీ విన్‌ అసలైన, అందమైన ఉగాది కానుక....వినోద గీతిక!

40 వేల గంటలకు పైగా ఉన్న ఈటీవీ కార్యక్రమాల భాండాగారం విన్‌ ప్రేక్షకుల వేలికొసలపై అందబోతోంది. ఇవన్నీ కేవలం రోజుకి 1 రూపాయి ఖర్చుతో, సంవత్సరానికి రూ.365 చెల్లించి మొబైల్‌లో చూడవచ్చు. మొబైల్‌తో పాటు టీవీలో కూడా వీక్షించాలనుకుంటే ప్రీమియం ప్లాన్‌లో ఏడాదికి రూ.499 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని