సింగమ్‌ ఆన్‌ డ్యూటీ

బాజీరావ్‌ సింగమ్‌గా సినీప్రియులకు యాక్షన్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’.

Published : 25 May 2024 00:51 IST

బాజీరావ్‌ సింగమ్‌గా సినీప్రియులకు యాక్షన్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’. ఈ కాప్‌ యూనివర్స్‌ చిత్రాన్ని రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా కశ్మీర్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు అజయ్‌. 

‘‘సింగమ్‌ ఆన్‌ డ్యూటీ. కశ్మీర్‌ షెడ్యూల్‌ ముగిసింది. రెండింతల యాక్షన్‌తో పోలీసు సింగమ్‌ మళ్లీ రావడానికి సిద్ధమవుతున్నార’’ని వ్యాఖ్యల్ని జోడించాడు. ఇందులో బాజీరావ్‌ సింగమ్‌గా యాక్షన్‌ అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అజయ్‌. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, జియోస్టూడియోస్‌తో కలిసి అజయ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.


ప్రతినాయకుడిగా ఆర్‌ మాధవన్‌..?

అజయ్‌ దేవగణ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దే దే ప్యార్‌ దే2’. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్షుల్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆర్‌ మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇటీవలే విడుదలైన ‘షైతాన్‌’లో అజయ్‌ను ఢీకొట్టే పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు ఆర్‌ మాధవన్‌. ఇప్పుడు ఈ కామెడీ చిత్రంలో కూడా అజయ్‌తో ముఖాముఖి పోటీ పడటానికి ఆయన మాత్రమే సరిపోతారని చిత్రబృందం నిర్ణయించుకుంది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే మాధవన్‌ ఈ ప్రాజెక్టులో నటించడానికి అంగీకరించారు. ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారాయన. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మే 1న విడుదల కానుందీ చిత్రం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని