‘నమో’... ఓ భావోద్వేగం!

విశ్వంత్‌ దుద్దుంపూడి, అనురూప్‌ కటారి కథానాయకులుగా... ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నమో’. విస్మయ కథానాయిక. ఎ.ప్రశాంత్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Published : 05 Jun 2024 01:03 IST

విశ్వంత్‌ దుద్దుంపూడి, అనురూప్‌ కటారి కథానాయకులుగా... ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నమో’. విస్మయ కథానాయిక. ఎ.ప్రశాంత్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకని ఉద్దేశించి కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ఇది నాకు కేవలం సినిమానే కాదు, ఓ భావోద్వేగం. ఓ కుటుంబంలా కలిసి మెలిసి చిత్రీకరణ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఇందులో లాజిక్స్‌ని పక్కనపెట్టి మ్యాజిక్‌ని మాత్రమే చూడాలి.  కచ్చితంగా పైసా వసూల్‌ చిత్రం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మంచి కథకి, మంచి నటులు తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారు. విశ్వంత్, అనురూప్, విస్మయ చాలా బాగా నటించారు. రాహుల్‌ శ్రీ వాస్తవ విజువల్స్‌ అలరిస్తాయి. క్రాంతి ఆచార్య సంగీతం మరో ఆకర్షణ. ఎక్కడా రాజీ పడకుండా చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఆదిత్య నాకు ఎప్పటినుంచో తెలుసు. ప్రతిభావంతుడైన తను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది. ఆదిత్య తనని తాను నిరూపించుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు. కథని నమ్మి సినిమాలు తీసే దర్శకనిర్మాతలకు తప్పక విజయం చేకూరుతుందన్నారు బెక్కం వేణుగోపాల్‌. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


కుటుంబ కథతో రాణీ ముఖర్జీ

‘బొంబాయి టాకీస్‌’, ‘మర్దానీ’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తన నటనతో సినీప్రియుల్ని అలరించింది బాలీవుడ్‌ సీనియర్‌ నాయికా రాణీ ముఖర్జీ. గతేడాది ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. ఇప్పుడు మరో ప్రాజెక్టుతో తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా కుటుంబ కథతో రూపొందుతున్న ఓ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘గత రెండేళ్లుగా దర్శకుడు షోనాలి బోస్‌తో తన రాబోయే ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతుంది రాణి. భావోద్వేగాల కలయికలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో నటించడానికి అంగీకరించిందామె. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరు నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును జంగ్లీ పిక్చర్స్‌ నిర్మిస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని