మహేశ్‌, ప్రభాస్‌, రామ్‌@100 మిలియన్స్‌

టాలీవుడ్‌ అగ్రకథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌ పోతినేని సరికొత్త రికార్డులను సృష్టించారు. వీరు కథానాయకులుగా నటించి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సినీ ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారు....

Updated : 28 Nov 2023 17:04 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌ పోతినేని సరికొత్త రికార్డులు సృష్టించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న వీరి సినిమాలను ఏళ్లు గడుస్తున్నప్పటికీ సినీ ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇటీవల ప్రభాస్‌, రామ్‌ చిత్రాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్‌ యూట్యూబ్‌లో రికార్డులు సొంతం చేసుకోగా.. తాజాగా మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటించిన ఓ సినిమా సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. 

మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత మనం పుట్టి, పెరిగిన ఊరికి ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీమంతుడు’. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై మహేశ్‌ కెరీర్‌లోనే సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలైనప్పుడే ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘శ్రీమంతుడు’ చిత్రం యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 100 మిలియన్ల మంది వీక్షించారు. తెలుగులో ఓ పూర్తి చిత్రాన్ని 100 మిలియన్ల మంది వీక్షించడం ఈ సినిమాతోనే సాధ్యమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది.

ఎనర్జీటిక్‌ డ్యాన్స్‌ ఉర్రూతలూగిస్తున్న రామ్‌..

టాలీవుడ్‌ ఎనర్జీటిక్‌ హీరో రామ్‌ పోతినేని, ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా రామ్‌, పూరీ జగన్నాథ్‌కు మాస్‌ హిట్‌ను అందించింది. మణిశర్మ స్వరాలు అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే. ఇందులోని ‘దిమాక్‌ కరాబే’ అనే పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 100 మిలియన్ల మంది వీక్షించారు.

‘రెబల్‌’స్టార్‌ ప్రభాస్‌..

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెబల్‌’. 2012లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే ఈ సినిమా పతాక సన్నివేశంలో ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని క్లైమాక్స్‌ సీన్‌ను 100 మిలియన్ల మంది వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని