Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్‌

‘‘తాతలాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరుకోలేను’’ అని ఎన్టీఆర్‌ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌ పేర్కొన్నారు.

Updated : 23 Mar 2023 10:33 IST

కళ్యాణ్‌రామ్‌తో నరసింహన్‌, అలీ తదితరులు

టీనగర్‌, న్యూస్‌టుడే: ‘‘తాతలాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరుకోలేను’’ అని ఎన్టీఆర్‌ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌ పేర్కొన్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. చెన్నై రాయపేటలోని మ్యూజిక్‌ అకాడమీ ఆవరణ వేదికైంది. కళ్యాణ్‌రామ్‌తోపాటు హాస్యనటుడు అలీ, గేయ రచయిత చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్‌, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు ప్రసంగించారు. అనంతరం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

ముందుగా బాపూబొమ్మ పురాస్కారాన్ని నటీమణి ఈశ్వరిరావు, బాపూరమణల పురస్కారాన్ని సినీదర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పిపి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఉత్తమ నటీ అవార్డును నటీమణి సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్ర అవార్డును ‘బింబిసార’ ప్రతినిధులు అందుకున్నారు. లతా మంగేష్కర్‌ పురస్కారాన్ని నటీమణి శ్రీలేఖ, వీఎస్‌ఆర్‌ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్‌ వంశీ పచ్చిపులుసు స్వీకరించారు. ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశికాంత్‌, సుభాష్‌ చంద్ర విశిష్ట అవార్డులు, ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌ ప్రధాన నిర్వాహకుడు రమేష్‌ జీవిత సాఫల్య అవార్డును స్వీకరించారు. అంతకుముందు అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగం వినిపించారు. తర్వాత జరిగిన మేనక పిపి బోరా బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. 

మాజీ గవర్నరు నరసింహన్‌ను సత్కరించిన నిర్వాహకులు, అవార్డు గ్రహీతలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని