కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?

Kaun Banega Crorepati: కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు.

Updated : 01 Dec 2023 14:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati). అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షోలో పాల్గొన్న 14ఏళ్ల బాలుడు సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.కోటి గెలుచుకుని రికార్డు సృష్టించాడు. కేబీసీ జూనియర్స్‌ స్పెషల్‌లో భాగంగా హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌ (Mayank) 8వ తరగతి చదువుతున్నాడు. తాజాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.కోటిని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

షో మొదలైన తర్వాత మయాంక్‌ ఒక లైఫ్‌ లైన్‌ కూడా వాడకుండా రూ.3.2లక్షల వరకూ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. రూ.12.5లక్షల ప్రశ్నకు ఒక లైఫ్‌ లైన్‌ వాడుకున్నాడు. ఇక రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పిన అనంతరం మయాంక్‌ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో షో చూస్తున్న వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’లో సన్నివేశాన్ని తలపించేలా ఈ ఎపిసోడ్‌ అనుభూతిని పంచింది.

‘కొత్తగా కొనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి దాని మ్యాప్‌ను తయారు చేసిన యూరోపియన్‌ క్యాట్రోగ్రాఫర్‌ ఎవరు?’ అని రూ.కోటి ప్రశ్న అడిగిన అమితాబ్‌ అందుకు సమాధానాలుగా A.అబ్రహాం ఓర్టెలియస్‌, B.గెరాడస్‌ మెరేక్టర్‌, C.జియోవన్నీ బాటిస్టా అగ్నెస్‌, D.మార్టిన్‌వాల్డీ ముల్లర్ అంటూ ఆప్షన్స్‌ ఇచ్చారు. దీంతో మయాంక్‌.. D.మార్టిన్‌ వాల్డీముల్లర్‌ ఆప్షన్‌ ఎంచుకుని రూ.కోటిని సొంతం చేసుకున్న తొలి జూనియర్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. అనంతరం రూ.7 కోట్ల ప్రశ్నను ప్రయత్నించి షో నుంచి క్విట్‌ అయ్యాడు. ఈ సందర్భంగా మయాంక్‌కు హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ (Haryana CM Manohar Lal Khattar) శుభాకాంక్షలు తెలిపారు. ‘జీనియస్‌’ అంటూ ప్రశంసలు కురిపించారు. కేబీసీలో పాల్గొనడం తన అదృష్టమని, అందునా అమితాబ్‌ సర్‌కు ఎదురుగా కూర్చొని సమాధానలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని మయాంక్‌ చెప్పుకొచ్చాడు. కేబీసీలో పాల్గొనేలా తనని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని