Mamitha Baiju: ఆ దర్శకుడు నాపై చేయి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి

తమిళ దర్శకుడు బాలపై తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని నటి మమితా బైజు స్పష్టం చేశారు.

Published : 01 Mar 2024 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో నటి మమితా బైజు (Mamitha Baiju) పేరు చర్చనీయాంశమవుతోంది. ఆమె నటించిన ‘ప్రేమలు’ చిత్రం మలయాళంలో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకోవడంతో అదే పేరుతో దీన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. మార్చి 8న దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇదంతా పక్కనపెడితే.. ఇటీవల మమితా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ దర్శకుడు బాల తనపై ‘వనంగాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో చేయి చేసుకున్నారని ఆరోపించినట్లు కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఆమె ఇన్‌స్టా వేదికగా వివరణ ఇచ్చారు. ‘కొన్ని రోజుల నుంచి నాపై మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నేను దర్శకుడు బాల గురించి అలా మాట్లాడలేదు. ఆయనతో నేను ‘వనంగాన్‌’ సినిమా కోసం ఏడాది పాటు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్‌ పనుల దగ్గర నుంచి సినిమా సెట్స్‌ పైకి వెళ్లేవరకు ఆయనతో పనిచేశాను. చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన వల్ల నేను ఏ రకంగాను ఇబ్బంది పడలేదు. బాల నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు. ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా నేను ఆ చిత్రం నుంచి వైదొలగాను’ అని వివరణ ఇచ్చారు.

‘ప్రేమలు’ విషయానికొస్తే.. ఈ చిత్రం మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైంది. సుమారు రూ.3 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటివరకు రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీన్ని మరికొన్ని భాషల్లో రీమేక్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని