Cinema News: కొత్త సినిమా ముచ్చట్లు

అజయ్‌ దేవ్‌గణ్‌ స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా’. ఇది తమిళ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌.

Updated : 25 Jan 2023 08:12 IST

ఒక్క పదునైన శిల.. వందమంది రాక్షసులు

జయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా’ (Bholaa). ఇది తమిళ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌. తబు (Tabu) కీలక భూమిక పోషిస్తున్నారు. మంగళవారం చిత్ర రెండో ట్రైలర్‌ విడుదల చేశారు. ఖైదీగా ఉంటూ తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు.. పోలీసులకు సాయ పడుతూ దుష్టులను దనుమాడేలా హీరోయిజం ప్రదర్శించాడు. ఇందులోని పోరాట సన్నివేశాలు భీతి గొలిపేలా ఉన్నాయి. పోలీసు అధికారిగా టబు తనదైన స్టైల్‌లో మెప్పించారు. ఈ టీజర్‌ని అజయ్‌ దేవ్‌గణ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘ఒక పదునైన శిల.. వందమంది రాక్షసులతో తలపడితే ఎలా ఉంటుందో ఈ టీజర్‌’ అని ట్వీట్‌ చేశారు. ‘భోళా’ మార్చి 30న విడుదలవుతోంది.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో..: సీనియర్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, దర్శకుడు నీరజ్‌ పాండే కలయికలో కొత్త సినిమా పట్టాలెక్కనుందని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆ చిత్రం రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనుందనీ, రెండు భిన్న కాలాలకు సంబంధించి ఉంటుందని మంగళవారం వివరాలు ప్రకటించారు. ‘1990ల నాటి నేపథ్యంతో కథ మొదలవుతుంది. ప్రస్తుత కాలంలో కీలక సన్నివేశాలతో ముగుస్తుంది. అజయ్‌ దేవ్‌గణ్‌కి జోడీగా సయీ మంజ్రేకర్‌, తబులు నటించనున్నారు’ అని పేర్కొన్నారు. త్వరలోనే లఖ్‌నవూలో షూటింగ్‌ మొదలు కానున్నట్టు చిత్రబృందం తెలిపింది.


‘కబ్జా’ ఎప్పుడంటే?

పేంద్ర (Upendra) కథానాయకుడిగా... శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై రూపొందుతున్న  బహుభాషా చిత్రం ‘కబ్జా’ (Kabza). శివ రాజ్‌కుమార్‌, శ్రియ శరణ్‌, కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలు పోషించారు.  చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.టి.బి.నాగరాజ్‌ సమర్పకులు. ఈ చిత్రాన్ని పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చ్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. ‘‘కన్నడ నుంచి ‘కె.జి.ఎఫ్‌’, ‘777 చార్లి’, ‘విక్రాంత్‌రోణ’, ‘కాంతార’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలొచ్చి సంచలన విజయం సాధించాయి. ఆ కోవలో రూపొందిన మరో చిత్రమే ‘కబ్జా’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 1947 నుంచి 1984 కాలం నేపథ్యంలో సాగే కథ ఇది. స్వాతంత్య్ర సమరయోధుడి కొడుకు మాఫియా ప్రపంచంలో ఎలా చిక్కుకున్నాడు? అతను ఏ స్థాయికి చేరాడన్నది ఈ కథలో కీలకం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, సముద్రఖని, మురళీశర్మ, నవాబ్‌ షా, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌.


ఉద్యమ ‘సిందూరం’

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘సిందూరం’ (Sindhooram). శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్‌ రెడ్డి జంగా నిర్మాత. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్‌ తుమ్మలపల్లి మాట్లాడుతూ ‘‘చరిత్రలో నిక్షిప్తమైన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. నక్సల్స్‌ ఉద్యమం, ప్రేమ పోరాటం, రాజకీయం మేళవింపుగా సాగుతుంది. ఒక నిజాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నామ’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీశామనే తృప్తి ఉంది. అందరికీ మంచి పేరు తీసుకొచ్చే ఓ మంచి చిత్రం ఇది’’ అన్నారు. నటుడు శివబాలాజీ మాట్లాడుతూ ‘‘దర్శకుడు బాగా పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నారు. నేను తొలిసారి నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తున్నా’’ అన్నారు.


ఒక సినిమా.. పది కథలు!

‘‘కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం ‘వాలెంటైన్స్‌ నైట్‌’’ (Valentines Night) అన్నారు నటుడు చైతన్యరావు మదాడి. ఆయన.. సునీల్‌, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ గోపిరెడ్డి తెరకెక్కించారు. తృప్తి పాటిల్‌, సుధీర్‌ యాళంగి మహీంధర్‌ నారల నిర్మించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో చైతన్యరావు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అనిల్‌ ఈ చిత్రాన్ని చాలా కొత్తగా తెరకెక్కించారు. ఇందులో చాలా జానర్స్‌ ఉన్నాయి. ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకు మరో కథకు అద్భుతమైన సంబంధం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇందులో ప్రేమ, రొమాన్స్‌, టీనేజ్‌ లైఫ్‌.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు అనిల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని