NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్‌ 31..వైరల్‌ అవుతోన్న అప్‌డేట్‌

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 27 Mar 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలు కథను వివరంగా తెలపాలంటే సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని అభిప్రాయ పడుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించి సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించే తర్వాత చిత్రాలకు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో విడుదలై సూపర్ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్‌2: శౌర్యాంగ పర్వం’ తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ఎన్టీఆర్‌తో చేయనున్న చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎన్టీఆర్‌31’ వర్కింగ్‌ టైటిల్‌తో  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రానున్న మూవీ అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని