Preity Zinta: వాళ్లకు బాలీవుడ్‌ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా

సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు.

Published : 19 Apr 2024 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రీతీ జింటా (Preity Zinta). తొలి చిత్రమే బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో నటించే అవకాశాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.   ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

‘ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారికి బాలీవుడ్‌ సురక్షిత ప్రదేశం కాదు. సినిమా నేపథ్యం మాత్రమే కాదు.. ఏదో ఒకరకంగా ప్రముఖులతో పరిచయాలు ఉండాలి. అలాంటివాళ్లే ఇక్కడ రాణించగలరు. ఎందుకంటే ఇక్కడ ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. వాళ్లందరినీ దాటుకొని అవకాశం మనవరకు రావాలంటే మనకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. లేదంటే రోడ్డు మధ్యలో నిల్చొని ఏ కారు ఢీకొంటుందోనని భయపడినట్లు ఉంటుంది వ్యవహారం’ అని చెప్పారు. ప్రీతీజింటా ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సహయజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

తొలి సినిమా ‘దిల్‌సే’ తోనే ప్రీతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్రేమంటే ఇదేరా’తో తెలుగువారికీ పరిచయమయ్యారు. అనంతరం వరుస బాలీవుడ్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. చివరిసారి సన్నీ దేవోల్‌తో కలిసి ‘భయ్యాజీ’లో నటించారు. ఆ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మంచి కథలు ఉంటే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని