Radha Krishna: నిర్మాత చినబాబు ఇంట విషాదం.. పవన్‌ కల్యాణ్‌ సానుభూతి

నిర్మాత చినబాబు ఇంట విషాదం నెలకొంది.

Published : 30 May 2024 21:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) (Radha Krishna) ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నాగేంద్రమ్మ (90) మరణించారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని విద్యుత్తు శ్మశాన వాటికలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగేంద్రమ్మకు చినబాబు సహా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె మనవళ్లలో ఒకరైన నాగవంశీ (Naga Vamshi) సైతం సినీ నిర్మాతే. చినబాబు కుటుంబానికి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సోషల్‌ మీడియా వేదికగా సానుభూతి ప్రకటించారు. నాగేంద్రమ్మ లేరన్న విషయం తెలిసి చింతించానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు చినబాబు. సితార ఎంటర్‌టైన్స్‌ పతాకంపై ‘డీజే టిల్లు’, ‘జెర్సీ’, ‘మ్యాడ్‌’ వంటి సినిమాలు నిర్మించారు నాగవంశీ. ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కొత్త సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) శుక్రవారం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని