Puri Musings: వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్‌

‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో పూరి జగన్నాథ్‌ మరో స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు. చైనీస్‌, జపనీస్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Published : 22 Apr 2024 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వలసల సమయంలో జనాభా విస్తరించడం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) మాట్లాడారు. యూట్యూబ్‌ వేదికగా వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న పూరి.. తాజాగా మరో ఆసక్తికర విషయంతో ముందుకొచ్చారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings)లో భాగంగా ఈసారి చైనీస్‌, జపనీస్‌ గురించి మాట్లాడారు.

‘వలసల సమయంలో మనుషులు ప్రపంచమంతా విస్తరించారు. కొంతమంది యూరప్‌ చేరుకుంటే మరికొందరు భారత్‌కు వచ్చారు. ఇంకొంతమంది మాత్రం హిమాలయాల వెనక ఏముందో చూడాలని దాన్ని ఎక్కే ప్రయత్నం చేశారు.  ఆ ప్రయత్నంలో వారంతా కొన్ని వందల సంవత్సరాలు ఆ మంచుకొండల్లోనే బతకాల్సి వచ్చింది. మంచులో ఉండే జంతువులను వేటాడుతూ.. వాటి చర్మంతో చేసిన దుస్తులు వేసుకొని బతికారు. వాళ్లకు సరైన పౌష్టికాహారం దొరక్క ఎముకల్లో ఎదుగుదల లోపించి పొట్టిగా తయారయ్యారు. ఆ చలికి సూర్యుడిని చూడలేక కళ్లు చిన్నవిగా చేసుకొని చూడడం ప్రారంభించారు. కాలక్రమేణా వాళ్ల కళ్లు చిన్నవిగా మారిపోయాయి. దీన్నే ‘ఎపికాంథిక్ ఫోల్డ్’ అంటారు. ఛాలెంజింగ్ వాతావరణంలో వాళ్ల రూపురేఖలు మారిపోయి తెల్లగా.. పొట్టిగా.. చిన్న కళ్లతో ఒక జాతి తయారైంది. ఆ జాతి కొన్ని రోజులకు హిమాలయాలు దిగి అటూ..ఇటూ.. వెళ్లిపోయి స్థిరపడింది. వాళ్లే జపనీస్‌, చైనీస్‌, కొరియన్స్‌’.

‘అదే సమయంలో భారత్ వచ్చి అడవుల్లో తిరిగిన మనుషులంతా ఎప్పుడు.. ఏ జంతువు దాడి చేస్తుందా అని అనుక్షణం కళ్లు తెరుచుకొని బతికారు. అందుకే మనకు కళ్లు పెద్దవిగా ఉంటాయి. అయితే, ‘ఎపికాంథిక్ ఫోల్డ్’ ఉన్న మనుషులు చాలా బలవంతులు. వాళ్ల డీఎన్ఏ మారిపోయింది. కఠినమైన వాతావరణంలోను బతకడం నేర్చుకున్నారు. వీళ్లందరూ మానసికంగా కూడా దృఢంగా.. ఎప్పుడూ మౌనంగా ఉంటారు. ఒంటరితనం అని అనిపించదు. ఓపిక, సహనం వాళ్ల రక్తంలో ఉంటాయి. మానవ సంబంధాలకు విలువనిస్తారు. వాళ్లతో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇండియన్‌ ఆర్మీలో కూడా ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. యుద్ధంలో వాళ్లను గెలవడం అంత తేలిక కాదు. కఠినమైన వాతావరణంలో పెరిగి.. దమ్ము ధైర్యంతో తయారైన డీఎన్‌ఏను కలిగిఉన్నారు. వాళ్లు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. సాహసాలంటే వాళ్లకు చాలా ఇష్టం. అందుకే ప్రపంచం కంటే ముందుంటారు. వాళ్లలో ఉన్న పట్టుదల మిగతా వాళ్లలో ఉండదు. అందుకే చైనీస్‌, జపనీయులు ప్రతీ దాంట్లో ముందుంటారు. మనం వాళ్లను చింకీస్‌ అంటాం. కానీ, ఆ చింకీస్‌ చాలా శక్తిమంతులు’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని