Prasanth Varma: ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఫొటో షూట్‌.. ప్రోమో రెడీ అయింది

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రశాంత్‌వర్మ చేయనున్న సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది

Published : 25 May 2024 16:23 IST

హైదరాబాద్‌: ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma).. తెలుగులోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న దర్శకుడు. ‘హనుమాన్‌’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా జరుగుతోంది. మరోవైపు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తోనూ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ రద్దయిందని వస్తున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని పేర్కొంది.

‘రణ్‌వీర్‌ సింగ్‌, ప్రశాంత్‌వర్మ కాంబో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల రద్దయిందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. ఇటీవల ఫొటో, ప్రోమో షూట్‌ కూడా పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘హనుమాన్‌’ తరహాలోనే మైథలాజికల్‌ టచ్‌ ఉన్న పీరియాడికల్‌ డ్రామాగా తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.  రూ.200కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో దీనిని తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) పనుల్లో బిజీగా ఉన్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. గత చిత్రంతో పోలిస్తే సీక్వెల్‌ 100 రెట్లు భారీ స్థాయిలో ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని